కేసీఆర్... ఆర్టీసీకి రైట్ రైట్ చెబుతారా? స్టాప్ అంటారా?

సోమవారం, 18 మే 2020 (12:37 IST)
లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఆర్టీసీ బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. అయితే... ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసికి సీఎం జగన్ రైట్ రైట్ అంటూ పచ్చ జెండా ఊపారు. దీంతో తెలంగాణలో సీఏం కేసీఆర్ ఆర్టీసికి రైట్ రైట్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? లేక ఇంకొన్నాళ్లు ఆగాలి అని స్టాప్ అంటారో అనేది ఆసక్తిగా మారింది.
 
అయితే.... గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులు నడపాలి అనుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా వచ్చినట్లు తెలిసింది. మంగళవారం నుంచే బస్సులు నడిపేలా ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 
 
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతానికి బస్సులు నడిపేలా, అదీ భౌతిక దూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోనున్నారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇంకా స్పష్టత రాలేదు. 50 శాతం బస్సులను నడుపుకొనేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా, వ్యాధి తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడపలేదు.
 
అయితే... ఇప్పుడు జీహెచ్‌ఎంసీ మినహా గ్రీన్, ఆరెంజ్ జోన్లు పెరిగిన నేపథ్యంలో బస్సులు నడిపితే బెటర్ అని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రోజు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అధ్యక్షతన ఆర్టీసీ హైలెవల్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్‌లో బస్సుల నిర్వహణ పై ప్లాన్ రెడీ చేసి, సాయంత్రం జరిగే కేబినెట్ భేటీలో దీన్ని ప్రస్తావించనున్నట్లు సమాచారం.
 
మొత్తానికి ఈ రోజు జరిగే కేబినేట్ మీటింగ్‌లో ఆర్టీసీ బస్సుల సర్వీసులపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్‌లో కేంద్రం గైడైన్స్ అమలు చేయడం కోసం ప్రణాళిక, నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం, ప్రభుత్వం ఇచ్చే అవార్డులు రద్దు తదితర అంశాలపై చర్చించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు