వయస్సులో పెద్దది.. కానీ ప్రేమించాడు.. పెళ్లి జరుగుతుందో లేదోనని..?

శనివారం, 28 నవంబరు 2020 (16:42 IST)
ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ మామిడి తోటలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. వేల్పూర్ మండలం కుక్నూరు వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వర్ కుమారుడు రోహిత్ (17) ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న అవంతిలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. 
 
అయితే వీరిలో అమ్మాయి పెద్దది, అబ్బాయి ఆమె కంటే చిన్నవాడు. అయితే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యులు కూడా వీరి వివాహానికి ఒప్పుకొన్నారు. కానీ మధ్యలో మళ్లీ మేజర్ అయిన తర్వాత కుటుంబ సభ్యులు వివాహం జరుపుతారో లేదోనన్న సందేహంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు బంధువులు తెలిపారు. 
 
ఆర్మూర్ సీఐ రాఘవేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు