కరోనా నెగెటివ్ అయితేనే ఇంట్లోకి అడుగుపెట్టు.. గేటుకు తాళం వేసిన భార్య... ఎక్కడ?

శుక్రవారం, 17 జులై 2020 (11:41 IST)
భార్యాబిడ్డలను పోషించడానికి పొట్ట చేతబట్టుకుని ఆ భర్త పొరుగు రాష్ట్రానికి ఉపాధికోసం వెళ్లాడు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధిని కోల్పోయాడు. ఆ తర్వాత అష్టకష్టాలుపడి ఇంటికి వచ్చాడు. కానీ, తనకు, పిల్లలకు కరోనా సోకుతుందన్న భయంతో భార్య.. కట్టుకున్న భర్తను ఇంట్లోకి అడుగుపెట్టేందుకు వీల్లేదంటూ గేటుకు తాళం వేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు బతుకుతెరువు కోసం మహారాష్ట్ర వెళ్లి భివాండిలోని ఓ పరిశ్రమలో పనిచేస్తూవచ్చాడు. ఈ క్రమంలో కరోనా లాక్డౌన్ కారణంగా పరిశ్రమ మూతపడటంతో ఉపాధిని కోల్పోయాడు. దీంతో అష్టకష్టాలుపడి బుధవారం తిరిగి సిరిసిల్ల చేరుకున్నాడు. 
 
ఇంటికి వచ్చిన భర్తను చూసిన అతడి భార్య సంతోషపడకపోగా, కరోనా భయంతో ఇంట్లోకి రావద్దని హెచ్చరించింది. ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారని, కాబట్టి వారికేమైనా అయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందిన ఆమె.. 14 రోజులు ఎక్కడైనా గడిపి ఆ తర్వాత ఇంటికి రావాలని కోరింది. 
 
అంతేకాదు, అతడు ఇంట్లోకి రాకుండా గేటుకు తాళం వేసేసింది. దీంతో అతడు గేటు ముందే కొన్ని గంటలపాటు వేచి చూశాడు. అయినా భార్య కనికరించలేదు. అతడి బాధను చూసిన స్థానికులు ఆమెకు నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో తలా ఇన్ని డబ్బులు పోగేసి అతడికి ఇవ్వడంతో తిరిగి భివాండి వెళ్లిపోయాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు