బల్దియా ఎన్నికలు : 28న హైదరాబాద్‌ వస్తున్న నరేంద్ర మోడీ

శుక్రవారం, 27 నవంబరు 2020 (07:18 IST)
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఈ ఎన్నికల ప్రచారం జాతీయ స్థాయి నెతలను రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రచారం చేశారు. బీజేపీ తయారు చేసిన మేనిఫెస్టోను సైతం విడుదల చేశారు. అలాగే, బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌లతో పాటు.. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రచారానికి రానున్నారు. 
 
ఇందులోభాగంగా శనివారం ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. వ్యాక్సిన్‌ పురోగతిని పరిశీలించేందుకు ఆయన పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(సీఐఐ), హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించనున్నారు. 
 
అందులో భాగంగా శనివారం ఉదయం ఆయన తొలుత పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు వెళ్తారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు పుణె నుంచి బయల్దేరి.. 3.45 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి భారత్‌ బయోటెక్‌కు చేరుకుని.. కొవాగ్జిన్‌ ఉత్పత్తి, పంపిణీ తదితర అంశాలను సమీక్షిస్తారు.
 
అనంతరం 5.15 గంటలకు బయల్దేరి హకీం పేట విమానాశ్రయానికి చేరుకుని.. 5.40 గంటలకు బయల్దేరి, రాత్రి 7.45 గంటలకు ఢిల్లీలో దిగుతారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ సభ జరగనున్న సంగతి తెలిసిందే. అదే రోజు మోడీ నగరానికి రావడం గమనార్హం. ఆయన ప్రచారంలో పాల్గొనకపోయినా, నగరానికి రావడం రాజకీయ సంకేతాలను ఇచ్చినట్టవుతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు