దుబ్బాక బీజేపీ అభ్యర్థి పేరు ఖరారు : చిక్కుల్లో రఘునందన్ రావు

బుధవారం, 7 అక్టోబరు 2020 (08:49 IST)
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో తెరాస అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్యకు సీటు కేటాయించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ కూడా నర్సిరెడ్డికి సీటు ఇవ్వగా, బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ క్రమంలో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆయన కారులో రూ.40 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
హైదరాబాద్ శివారు ప్రాంతం శామీర్‌పేట అవుటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు నలుగురు వ్యక్తుల నుంచి రూ.40 లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. వీరిని డీసీపీ పద్మజ విచారించారు. ఈ డబ్బును దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఇచ్చేందుకు తీసుకెళుతున్నట్టుగా వారు చెప్పినట్టు తెలిసింది. ఈ డబ్బు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు.
 
కాగా, డబ్బు తరలిస్తున్న వ్యక్తులకు, రఘునందన్ పీఎ సంతోష్‌కు మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు వెల్లడైందని, దీనికి సంబంధించిన ఆడియోను సేకరించామని చెప్పారు. ఈ డబ్బు పటాన్‌చెరు నుంచి సిద్ధిపేట తీసుకెళ్తున్నట్లు తెలిసిందని ఆమె వివరించారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో పెద్దమొత్తంలో నగదు లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు రఘునందన్‌ను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు