కమలం గూటికి రాములమ్మ...???

మంగళవారం, 27 అక్టోబరు 2020 (21:52 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉంటూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమటీ ఛైర్‌పర్సన్‌గా ఉంటున్న సినీ నటి విజయశాంతి త్వరలోనే పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంటే, కాంగ్రెస్ పార్టీకి స్వస్తి చెప్పి కమలం గూటికి చేరాలన్న ఆలోచనలో ఆమె ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వార్తలను రుజువు చేసేలా ఆమె వైఖరి కూడావుంది. నిజానికి రాములమ్మ గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దుబ్బాకలో హాట్‌హాట్‌గా ఉప ఎన్నికల ప్రచారపర్వం జరుగుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. 
 
కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయమని పిలుపు ఇవ్వలేదు. దీంతో రాములమ్మ కాంగ్రెస్‌కు దూరం కానున్నట్లు ప్రచారం జరిగింది. అన్నట్టుగానే ఆమె త్వరలో కమలం గూటికి చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 
 
ఇదిలావుంటే, సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అర్థగంటపాటు ఈ సమావేశం జరిగినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 
 
అంతేకాకుండా ఈ సమావేశానికి కొద్ది రోజుల కిందట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం. నవంబర్ 10 లోపు ముహూర్తం చూసుకుని రాములమ్మ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి కమలం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తలే నిజమైతే తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో మంచి జనాకర్షక మహిళా నేతగా గుర్తింపు పొందిన సినీ నటి ఖుష్బూ కూడా ఇటీవల బీజీపీలో చేరిన విషయం తెల్సిందే. ఇపుడు ఖుష్బూ బాటలోనే విజయశాంతి కూడా నడిచే అవశాలు అధికంగా కనిపిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు