చెర్రీ కోసం పోటీపడుతున్న ఇద్దరు భామలు.. ఆఫర్ తిరస్కరించిన నటుడు?

బుధవారం, 15 జులై 2020 (15:06 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చాలా మేరకు పూర్తికాగా, కరోనా లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది. అయితే, ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌లో హీరోయిన్ పాత్ర లేకుండానే షూటింగ్ పూర్తి చేశారు. దీనికికారణం ఇప్పటివరకు హీరోయిన్‌ను ఎంపిక చేయకపోవడమే. 
 
ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చాలా చిన్నదిగా ఉంటుందట. అందుకే చాలా మంది హీరోయిన్లు ఈ చిత్రం దర్శకనిర్మాతలు ఇస్తున్న ఆఫర్‌ను తిరస్కరిస్తున్నారు. అలాంటివారిలో త్రిష, తమన్నా, కాజల్ అగర్వాల్ ఇలా మరికొందరి పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ పేరును ఖరారు చేసినట్టు సమాచారం. 
 
మరోవైపు, ఈ చిత్రంలో చిరంజీవి తనయుడు, హీరో రాం చరణ్ ఓ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఆయనకు జోడీగా ఇద్దరు భామల పేర్లను పరిశీలించారు. వారు ఎవరో కాదు.. కీర్తి సురేష్. కియారా అద్వానీ.  వీరిద్దరిలో ఎవరో ఒకరు చెర్రీ సరసన కనిపించబోతున్నారట. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుందట.
 
మరోవైపు, బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ విలన్ పాత్రల్లో రాణిస్తున్న నటుడు వివేక్ ఒబేరాయ్  'లూసిఫర్' తెలుగు రీమేక్‌లో నటించేందుకు నిరాకరించాడట. మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్'ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
అయితే, మాతృకలో విలన్ పాత్రలో కనిపించిన వివేక్‌నే తెలుగులోకి కూడా తీసుకోవాలని చిత్రబృందం భావించిందట. వివేక్‌తో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే మరోసారి అదే పాత్రలో కనిపించేందుకు వివేక్ నిరాకరించాడని సమాచారం. దీంతో ఆ పాత్రకు నటుడు రెహ్మాన్‌ను తీసుకున్నారట. గతంలో మెగాస్టార్ 'ఖైదీ నెంబర్ 150'లో విలన్ పాత్రను కూడా వివేక్ తిరస్కరించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు