`శుభ‌సంక‌ల్పం` తర్వాత డీ గ్లామ‌ర్: ఆమ‌ని

సోమవారం, 25 జనవరి 2021 (18:37 IST)
అమ్మ... ఈ సెంటిమెంట్ తెలుగు తెరకు ఎప్పుడు కొత్తదే. అమ్మ ప్రేమలో ఎంత నిజాయితీ ఉంటుందో.. అమ్మ సినిమాలు కూడా ప్రేక్షకులకు అంతే సంతృప్తిని కలిగిస్తాయి. ఇప్పటి వరకు అమ్మ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలని సెంటిమెంటల్ హిట్స్‌గా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసాయి.

అమ్మ రాజీనామా, మాతృదేవోభవ, యమలీల, తాజగా బిచ్చగాడు వంటి చిత్రాలు ఎలాంటి విజయాలు అందుకున్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తూ .. వస్తున్న చిత్రం "అమ్మదీవెన". ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్రలో, లక్ష్మి స‌మ‌ర్ప‌ణలో, శివ ఏటూరి దర్శకత్వంలో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పైన ఎత్తరి మార‌య్య‌, ఎత్తరి చినమారయ్య, ఎత్తరి  గుర‌వ‌య్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అయింది.

ఈ సందర్బంగా ప్రముఖ నటి ఆమని మాట్లాడుతూ, దర్శకుడు శివ‌ ఈ కధ చెప్పిన‌ప్పుడు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా చాలా సన్నివేశాలు అందరినిఆట్టుకునే విధంగా ఉంటాయి. శుభ‌సంక‌ల్పం తర్వాత ఈ సినిమాలో డీ గ్లామ‌ర్ పాత్ర చేశాను. యుక్త వయసు నుండి వృద్ధాప్యం వరకు ఓ మహిళా చేసే ప్రయాణమే ఈ సినిమా. ఐదుగురు పిల్లల తల్లి వాళ్ళను ప్రయోజకుల్ని చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. సమాజం నుండి ఎదురైన కష్టనష్టాలను ఎలా అధిగమించింది. తన కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దడం కోసం ఎలాంటి త్యాగాలు చేసింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుంది.

కష్ఠాలు ఎదురైనప్పుడు ఎదిరించి పోరాడాలి కానీ ఆత్మహత్య తో జీవితాన్ని ముగించకూడదు అని చెప్పే మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ కథ మొత్తం నా పాత్ర చుట్టే తిరుగుతుంది. పోసాని కృష్ణమురళి ఓ వ్యక్తిగా చక్కగా నటించారు. అలాగే దర్శకుడు శివ కూడా చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. తప్పకుండా ఇది అందరికి నచ్చే సినిమా, అందరిపై సినిమా. నాకు కూడా కెరీర్ పరంగా చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. ఇంతమంచి చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, అప్పుడే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ... ఆమని గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్లో నటించారు. నటిగా ఆమె ఎన్ని భిన్నమైన పాత్రల్లో మెప్పించారో అందరికి తెలుసు. మా అమ్మ దీవెన సినిమాలో తల్లి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తప్పకుండా ఈ సినిమాతో ఆమెకు ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరుగుతుంది. ఈ చిత్రంలో ఆమె నటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. తల్లి ప్రేమ గురించి గొప్పగా చెప్పే చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులు చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము అన్నారు.
 
ద‌ర్శ‌కుడు శివ ఏటూరి మాట్లాడుతూ... ఇది కుటుంబం అంతా కలిసిచూసే చాలా మంచి సినిమా, ఈ నెల 29న థియేటర్స్ లో విడుద‌ల కాబోతుంది, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు. ఆమని, పోసాని, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, డి ఎస్ రావు, కావ్య, యశ్వంత్, నానియదవ్, అరుణ్  తదితరులు నటించిన ఈ చిత్రానికి  ఎడిటర్ : జానకిరామ్, డాన్సులు : గణేష్ స్వామి, నాగరాజు, చిరంజీవి, ఫైట్స్ : నందు, పి.ఆర్ఓ. : సాయి సతీష్, పర్వతనేని, మాటలు : శ్రీను. బి, సంగీతం : ఎస్.వి.హెచ్, డి ఓ పి : సిద్ధం మనోహర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పవన్, నిర్మాత : ఎత్తరి గుర‌వ‌య్య,  దర్శకత్వం: శివ ఏటూరి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు