కంగనాకు ఊరట... బీఎంసీ అధికారులకు హైకోర్టు నోటీసు

బుధవారం, 9 సెప్టెంబరు 2020 (15:38 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ముంబై హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. అదేసమయంలో బృహన్ ముంబై నగర పాలక సంస్థ అధికారులకు మాత్రం హైకోర్టు నోటీసులు పంపించింది. కంగనా పిటిషన్‌పై సమాధాన పత్రం దాఖలు చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. 
 
ముంబై బాంద్రా బంగ్లాలో అక్ర‌మంగా మార్పులు జ‌రిగిన‌ట్లు బీఎంసీ అధికారులు చెబుతున్నారు. దానిలో భాగంగానే ఇంటికి నోటీసులు అంటించిన‌ట్లు బీఎంసీ అధికారులు చెప్పారు. బుధవారం మ‌ధ్యాహ్నం 12.30 నిమిషాల‌కు కంగ‌నా ఆఫీసుకు వెళ్లిన బీఎంసీ అధికారులు బుల్డోజ‌ర్ల‌తో ఆ భవనంలో అక్రమంగా మార్పులు చేర్పులు చేసిన ప్రాంతాన్ని కూల్చివేశారు. 
 
మ‌రో వైపు బిల్డింగ్ కూల్చివేత‌ను అడ్డుకోవాలంటూ కంగ‌నా త‌ర‌పు న్యాయ‌వాది కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. బంగళాలో అక్రమ మార్పులు జరిగాయని ఆరోపిస్తూ బృహన్ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ) చేపట్టిన చర్యలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆమె పిటిషన్‌పై సమాధానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ, నోటీసులు జారీ చేసింది. 
 
కాగా, తన బంగళాలో అక్రమాలు జరిగాయంటూ బీఎంసీ కూల్చివేతలకు పాల్పడటంపై కంగన తీవ్రంగా మండిపడ్డారు. తాను శివసేనతో పోరాటం చేస్తున్నందువల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ముంబై నిజంగానే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరు అయిందంటూ మండిపడ్డారు 
 
ఇదిలావుండగా, బుధవారం ఆమె ఇచ్చిన ట్వీట్‌లో బాలీవుడ్ ఈ ఆగడాలను గమనించాలని కోరారు. 'నా ఇంట్లో ఎటువంటి చట్టవిరుద్ధ నిర్మాణం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం కోవిడ్ సమయంలో కూల్చివేతలను సెప్టెంబరు 30 వరకు నిషేధించింది. బుల్లీవుడ్! ఇప్పుడు దీనిని గమనించు, నియంతృత్వం ఇలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యం చచ్చింది' అంటూ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు