రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ఆత్మీయులను కోల్పోయాను.. ఎన్టీఆర్

బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (17:06 IST)
2014 డిసెంబర్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య హరికృష్ణ పెద్ద కొడుకు జానకి రామ్ మరణించారు. 2018 డిసెంబర్ 17న తండ్రి హరికృష్ణ ఇదే జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఈ నేపథ్యంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కేంద్రానికి బుధవారం విచ్చేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షిక సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. వారు వినియోగించే రక్షణాత్మక పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు.
 
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తారక్.. రోడ్డు ప్రమాదాలు కుటుంబసభ్యులకు కన్నీరు మిగులుస్తాయని అన్నారు. నేను ఈ సమావేశానికి ఒక నటుడిగా రాలేదు. ఒక పౌరునిగా ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితుడిగా వచ్చాను. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. రోడ్డు జాగ్రత్త సూచనలు పాటించడం ముఖ్యమైన విషయం అని ఆయన వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ఆత్మీయులను కోల్పోయానని.. అన్న జానకిరామ్, నాన్న హరికృష్ణను రోడ్డు ప్రమాదాల్లోనే కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మనం జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు పొంచి ఉంటాయని.. వేగంగా వాహనం నడిపేటప్పుడు కుటుంబాన్ని గుర్తు చేసుకోండని కోరారు. మీ రాక కోసం కుటుంబసభ్యులు ఎదురు చేస్తుంటారని గుర్తుకోండని సూచించారు. దయచేసి నిబంధనలు పాటించి వాహనం నడపాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల చేతిలో ఉన్న లాఠీ మనని దండించడానికి కాదని సన్మార్గంలో నడిపించడానికని గుర్తుచేశారు.
 
ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2009 మార్చిలో ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని వస్తున్న జూనియర్ ఎన్టీఆర్‌ కూడా ఇదే జిల్లాలో రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. అదృష్టవశాత్తు గాయాలతో బయటపడి కోలుకున్నారు. అతి వేగం ఎంత ప్రమాదకరమో అనుక్షణం గుర్తుంచుకోవాలని సమావేశంలో పాల్గొన్న ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు