ప్రపంచం మారినా.. నా మాజీ ప్రియుడు మాత్రం మారలేదు : కంగనా రనౌత్

ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (09:21 IST)
బాలీవుడ్‌లోని మాజీ ప్రేమ జంటల్లో హృతిక్ రోషన్ - కంగనా రనౌత్ ఒకటి. వీరిద్దరి మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ట్విట్టర్ వేదికగా వారిద్దరూ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తన మాజీ ప్రియుడిపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ ప్రపంచం చాలా మారిపోయిందని, తన మాజీ లవర్ మాత్రం ఇంకా మారకుండా అక్కడే ఉండిపోయాడని వ్యాఖ్యానించింది. ఎదిగేందుకు అవస్థలు పడుతూ ఉన్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 
 
కాగా, వీరిద్దరి మధ్య 2016 నుంచి నకిలీ ఈ-మెయిల్ వ్యవహారం సాగుతోంది. ఈ కేసులో హృతిక్ రోషన్‌ను తమ కార్యాలయానికి పిలిపించిన ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం, శనివారం అతని వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 
 
గత సంవత్సరం డిసెంబరులో పెండింగ్‌లోని నకిలీ ఈమెయిల్స్‌ను దర్యాఫ్తు చేయాలని హృతిక్ తరపు న్యాయవాది ముంబై పోలీసు కమిషనర్‌ను కలసి విన్నవించగా, ఆపై ఈ కేసు విచారణను క్రైమ్ బ్రాండ్‌కి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
 
హృతిక్, కంగనాల మధ్య ఐదేళ్ల క్రితం వరకూ నడిచిన ప్రేమ వ్యవహారం, 2016లో కోర్టుకు ఎక్కింది. కంగన చేసిన ఆరోపణలన్నింటినీ గతంలోనే హృతిక్ తోసిపుచ్చాడు. తన పేరిట ఎవరో నకిలీ ఖాతాను సృష్టించి, కంగనకు ఈ-మెయిల్స్ పంపాడన్నది హృతిక్ వాదన. వీటితో తనకేమీ సంబంధం లేదని హృతిక్ చెబుతుండగా, మొత్తం వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయని కంగన నమ్మకంగా అంటోంది.

ఒకవైపు హృతిక్‌ రోషన్‌తో జరుగుతున్న వివాదం కోర్టులో ఉండగా.. ఇప్పుడు ట్విట్టర్‌ని టార్గెట్‌ చేస్తూ.. ఆమె సంధించే అస్త్రాలు ట్రెండ్‌ అవుతున్నాయి. తన ట్వీట్లపై ఆమె చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటోంది.

అయితే ఆమెను తట్టుకోలేక ట్విట్టర్‌ ఇండియా కంగనా ఖాతాను షాడోబ్యాన్‌ చేసినట్లు కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆగ్రహానికి లోనైన కంగనా.. డైరెక్ట్‌గా ట్విట్టర్‌ సీఈఓపై ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు