'బాహుబలి'ని భయపెడుతున్న కేజిఎఫ్

బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:28 IST)
భారతీయ సిల్వర్ స్క్రీన్‌పై ఊహించని విధంగా భారీ విజయం సాధించిన సినిమా 'బాహుబలి'. అయితే దీన్ని తలదన్నే సినిమా తీయాలని ఇప్పటికే చాలా మంది ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డారు. కాగా ఇప్పట్లో 'బాహుబలి'ని తలదన్నే సినిమా రావడం దాదాపు అసాధ్యం అని భావించారు.
 
ఇలాంటి సమయంలో చాలా చిన్న చిత్రపరిశ్రమ అయిన కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న సినిమా కేజీఎఫ్. అయితే ఈ సినిమాకు రాజమౌళి ప్రమోషన్ కూడా బాగా కలిసొచ్చింది. 
 
కన్నడ స్టార్ యష్ నటించిన ఈ సినిమా మొదటి భాగం రూ.250 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాదాపు విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. అత్యంత తక్కువ మార్కెట్ ఉన్న కన్నడ చిత్రపరిశ్రమలోనే ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసింది, అటు బాలీవుడ్‌లో కూడా రూ.50 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
 
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు. తొలి భాగం ఇచ్చిన స్ఫూర్తితో రెండో భాగంలో అటు బాలీవుడ్, ఇటు దక్షిణాదిలో పేరున్న నటీనటులను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందులో సంజయ్ దత్‌తో పాటుగా అలనాటి హీరోయిన్ రవీనా టాండన్ నటిస్తున్నట్లు సమాచారం. మొదటి భాగానికి మించి రెండో భాగం ఉండాలనే పట్టుదలతో చిత్ర యూనిట్ పని చేస్తోంది. ఒకవేళ ఈ సినిమా బాగా ఆడి బాహుబలి రికార్డులను అధిగమించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు