మీ ఆశీస్సులతో ఆనందంలో తేలిపోతున్నా.. కృతిశెట్టి

సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (19:54 IST)
యువ హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలు జంటగా నటించిన చిత్రం ఉప్పెన. డెబ్యూ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. లాక్డౌన్ త‌ర్వాత విడుద‌లైన భారీ విజయం సాధించిన ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా రూ.70 కోట్ల‌కు పైగా గ్రాస్‌ని వ‌సూలు చేసింది. 
 
ఉప్పెన చిత్ర విజ‌యంపై ఇండ‌స్ట్రీ హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వంటి పెద్దలు చిత్ర బృందంలోని ప్ర‌తి ఒక్క‌రిని అభినందించ‌డ‌మే కాదు వారికి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌లు పంపిస్తున్నారు. 
 
"ఉప్పెన" చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో చిత్ర మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ ప్రసాద్‌కు లేఖ‌తో పాటు గిఫ్ట్‌ను పంపించారు. ఈ విష‌యాన్ని దేవి త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. ఇక చిత్ర హీరోయిన్ కృతి శెట్టికు కూడా చిరు లేఖ పంపారు. 
 
ఆ లేఖ‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్య‌క్తం చేసింది కృతి. "లేఖ‌లో పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళిస్తుంది అన్న దానికి నువ్వొక ఉదాహ‌ర‌ణ‌. స్టార్ కావ‌డం కోస‌మే నువ్వు పుట్టావు. భాష తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ, పాత్ర‌లో అద్భుతంగా జీవించావు. బేబ‌మ్మ పాత్రను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటారు. మంచి విజ‌యాల‌ను సాధించ‌కుంటూ ఇలానే ముందుకు సాగిపో" అంటూ చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు.
 
చిరు లేఖ‌పై స్పందించిన కృతి శెట్టి.. "చిరు స‌ర్ థ్యాంక్యూ.. మీ మాట‌లు నా హృద‌యాన్ని తాకాయి. మీరు  పంపిన గిఫ్ట్‌, మీ మాట‌లు ఎప్ప‌టికీ నా హృద‌యంలో నిలిచిపోతాయి. మీ ఆశీస్సులు పొందినందుకు ఆనందంలో తేలిపోతున్నా" అని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు