గాంధీ అంటే గౌరవం కానీ.. గాడ్సే అభిప్రాయాలనే చెప్పా.. అర్థం చేసుకోండి : నాగబాబు

మంగళవారం, 19 మే 2020 (22:06 IST)
నాథూరాం గాడ్సేపై మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై నాగబాబు మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చారు. గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేని నిజమైన దేశభక్తుడంటూ నాగబాబు గాడ్సే పుట్టిన రోజునైన మంగళవారం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం చెలరేగడంతో ఆయన మరోమారు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
దయచేసి అందరూ తనను అర్థం చేసుకోవాలని అన్నారు. తాను నాథూరామ్ గురించి చేసిన ట్వీట్‌లో అతను చేసిన నేరాన్ని సమర్థించలేదని, అతని అభిప్రాయాలు ఏమిటో జనానికి తెలియాలని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. తనకు గాంధీ అంటే చాలా గౌరవం అని అన్నారు. 'వాస్తవానికి నన్ను విమర్శించే వాళ్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం' అని పేర్కొన్నారు. 
 
అంతకుముందు నాగబాబు చేసిన ట్వీట్‌ను ఓసారి పరిశీలిస్తే, 
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సేను పుట్టిన రోజు సందర్భంగా ఈ అంశంపై ఆయన చర్చించారు. అదేంటంటే.. జాతిపిత గాంధీని గాడ్సే చంపడం కరెక్టా? కాదా? అన్నదే ప్రశ్న. ఇదే అంశంపై నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
ఇందులో ఆయన పేర్కొన్న అంశాన్ని పరిశీలిస్తే, "ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. కానీ, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)' అని పేర్కొన్నారు.
 
'గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్' అంటూ ట్వీట్ చేశారు. 
 
ఆయన వ్యాఖ్యలపై చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. గాంధీజీని చంపిన వ్యక్తిని గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో నాగబాబు కూడా పలు వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తూ మీడియాలో నానుతున్న విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు