'కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా': ఆర్జీవీకి నిర్మాత కౌంటర్

శనివారం, 25 జులై 2020 (15:20 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పవర్ స్టార్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శనివారం ఆర్జీవీ వరల్డ్ థియేటర్స్‌లో విడుదలైంది. ఈ చిత్రంలో మెగా ఫ్యామిలీతో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కించపరిచేలా కొన్ని సీన్లు ఉన్నాయి. వీటిపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఓ ట్వీట్ చేశారు. 
 
'ఈ రోజుల్లో సెన్సేషనలిజమ్ అనేది సాధారణంగా మారిపోయింది. తమ మనుగడ కోసం వేరు వారి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసే రాబంధులు ఎక్కువైపోయాయి. ఇలాంటి వారికి సిగ్గు ఉండదు. వారితో పోరాటం చేయడానికి ఏకైక మార్గం వారిని పట్టించుకోకపోవడమేన' అని నాగవంశీ ట్వీట్ చేశారు. 
 
'కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా' అంటూ జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత' మూవీలోని ఓ డైలాగ్‌తో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఖచ్చితంగా రాంగోపాల్ వర్మను లక్ష్యంగా చేసుకునే నాగవంశీ చేసినట్టుగా ఇట్టే తెలుస్తోంది. కానీ, ఆర్జీవీ పేరును ఎక్కడా ఆయన ప్రస్తావించకుండానే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్ ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు