పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో మల్టీస్టారర్ మూవీ

సోమవారం, 21 డిశెంబరు 2020 (15:28 IST)
యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12గా నిర్మిస్తున్న చిత్రం నేడు ప్రారంభమయింది. యువ దర్శకుడు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పి.డి.వి. ప్రసాద్ సమర్పకులు. 
 
ఈ సంస్థ కార్యాలయంలో ఈరోజు ఉదయం 11.19 నిమిషాలకు చిత్రం పూజా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవుని పటాలపై పవన్ కళ్యాణ్ క్లాప్ నివ్వగా, సుప్రసిద్ధ దర్శకులు త్రివిక్రమ్ కెమెరా స్విచాన్ చేశారు. చిత్రం స్క్రిప్ట్‌ను హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అందించారు. 
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వెంకీ అట్లూరిలతో పాటు మరికొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. నేడు లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలవుతుంది. 
 
కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్.ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన 'ప్రసాద్ మూరెళ్ళ' ఛాయాగ్రాహకునిగా, ఎడిటర్‌గా 'నవీన్ నూలి', కళా దర్శకునిగా 'ఏ.ఎస్.ప్రకాష్‌లు ఎంపిక అయ్యారు అని తెలిపారు. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీ, నటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియపరుస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు