జైల్లో జారిపడిన రాగిణి - నడుము - వెన్నెముకకు దెబ్బలు...

మంగళవారం, 13 అక్టోబరు 2020 (10:54 IST)
కన్నడ చిత్రసీమలో వెలుగు చూసిన మాదకద్రవ్య కేసులో అరెస్టు అయి బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉంటున్న కన్నడ సినీ నటి రాగిణి ద్వివేది జైల్లో జారిపడింది. దీంతో ఆమె నడుముతో పాటు.. వెన్నెముకకు గాయాలైనట్టు సమాచారం. ఈ కారణంగా తనను చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
ప్రస్తుతం జైల్లో ఉన్న రాగిణితో పాటు.. ఇదే కేసులో అరెస్టు అయిన మరో నటి సంజనా గల్రానీలు పరప్పణ అగ్రహారలోని కేంద్ర కారాగారంలోని ఒకే గదిలో కలిసి ఉంటున్నారు. వీరికి ఈ నెల 23 వరకు కస్టడీ కొనసాగనుంది. అయితే, రాగిణి తాజాగా కోర్టును ఆశ్రయించారు. జైలులో ప్రమాదవశాత్తు జారిపడిన తాను తీవ్రంగా గాయపడ్డానని నడుము, వెన్నెముకకు దెబ్బలు తగిలాయని పేర్కొన్నారు.
 
జైలులో తనకు వైద్య చికిత్స లభిస్తున్నప్పటికీ ఎటువంటి ఫలితం ఉండడం లేదని, కాబట్టి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సీసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.
 
ఈ మేరకు ఆమె తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, ఆమె తన కుటుంబ సభ్యులు, న్యాయవాదిని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. రాగిణి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాబ్లెట్, పెన్ డ్రైవ్‌లను తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసులను ఆదేశించాలంటూ మరో పిటిషన్‌ను కూడా న్యాయవాది దాఖలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు