సమాధిపై ఆ అవతారపురుషుడు చెప్పిన మాటలు రాయండి.. ఎస్పీబీ

శనివారం, 26 సెప్టెంబరు 2020 (16:43 IST)
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు. ఆయన గానం శాశ్వతంగా మూగబోయింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడ్డారు. 50 రోజులపైగా చికిత్స తీసుకున్నారు. ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. కానీ, ఆ వైరస్ శరీర అంతర్గత భాగాలను ముఖ్యంగా ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో ఆయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ అనారోగ్యం నుంచి కోలుకోలేక శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అయితే, ఆయన మృతిపట్ల ప్రతి ఒక్కరూ సంతాపాన్ని తెలుపుతున్నరాు. ఎస్పీ బాలు భౌతికంగా మ‌న‌కు దూర‌మైన పాట రూపంలో ఎల్ల‌ప్పుడు మ‌న మ‌ధ్యే ఉంటారనూ, ఆయ‌న‌కు సంబంధించిన ఎన్నో జ్ఞాప‌కాల‌ను అభిమానులు నెమ‌ర‌వేసుకుంటున్నారు. 
 
అయితే ఓ సందర్భంగా ఎస్పీబీ మాట్లాడుతూ, తన సమాధిపై రాయాల్సిన పదాలను చెప్పారు. అందుకు సంబంధించిన మాట‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 
 
1999వ సంవ‌త్స‌రంలో ఎస్పీ బాలు హోస్ట్ చేస్తున్న 'పాడుతా తీయ‌గా' కార్య‌క్ర‌మం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సంగీత సామ్రాట్ బాలముర‌ళీకృష్ణ‌ వచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రావు, మహదేవన్, ఎల్‌ఆర్ ఈశ్వరి, సుశీల కూడా పాల్గొన్నారు. 
 
ఇందులో బాలముర‌ళీ కృష్ణ... ఎస్పీబీ గురించి మాట్లాడుతూ "బాలు కాస్త కష్టపడితే నాలాగా పాడగలడు కానీ.. నేను ఎంత కష్టపడినా మా అబ్బాయిలా పాడలేను" అంటూ పుత్ర వాత్సల్యం ప్రదర్శించారు. 
 
ఈ విష‌యాన్ని 2017లో ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకుంటూ.. మంగళంపల్లి బాలమురళీకృష్ణ నా గురించి మాట్లాడిన మాట‌ల క‌న్నా గొప్ప ప్ర‌శంస మ‌రొక‌టి ఉండ‌దు. నాకు అదొక ఆస్తి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి గొప్ప సంగీత కళాకారులు అలాంటి మాటలతో తనకిచ్చిన స్ఫూర్తి ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు బాలు. 
 
తను చనిపోయిన తర్వాత సమాధిపై ఏమైనా రాయాలా అంటే ఒక అవతారపురుషుడు మంగళంపల్లి తనను ఇలా ప్రశంసించారని రాస్తే సరిపోతుందని బాలు వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు