తెలుగు సినీ ఇండస్ట్రీలో దారుణమైన ఘటనలు... చివరకు మమ అనిపించేశారు.. రాములమ్మ

శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (11:19 IST)
సీనియర్ సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత, ఫైర్‌బ్రాండ్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తెరవెనుక అనేక ఘోరమైన ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. వీటిపై దర్యాప్తు తూతూమంత్రంగా జరిపి... మమ అనిపించేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు టాలీవుడ్‌లో కలకలం రేపాయి. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో రోజుకో విధమైన చలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై విజయశాంతి స్పందిస్తూ, సుశాంత్ కేసులో దోషుల్ని పట్టుకునేందుకు, వాస్తవాల్ని వెలికి తీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయని ప్రశంసించారు. 
 
ఒకప్పుడు మన సినీ రంగంలోనూ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండేవని, ఎందరో మహిళా నటులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయా కేసుల్లో ఈ స్థాయిలో దర్యాప్తులు జరిగి ఉంటే వారి ఆత్మకు శాంతి కలిగి ఉండేదని అన్నారు. నామమాత్రపు కేసులు, తూతూమంత్రపు విచారణలతో చివరికి మమ అనిపించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అదేసమయంలో సుశాంత్ కేసులు ప్రతి రోజు వెలుగుచూస్తున్న విషయాలు విస్మయానికి గురిచేస్తున్నాయన్నారు. దర్యాప్తులు, విచారణలు వివక్షకు తావులేకుండా ఉండాలన్నారు. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకేలా ఉండాలన్న ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వ్యాఖ్యలను ఈ సందర్భంగా విజయశాంతి ఉదహరించారు. 
 
దర్యాప్తు సంస్థల వల్ల ఆశించిన స్థాయిలో ఫలితం రాని సమయాల్లో ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్లకపోవడం వల్ల ఎన్నో కేసులు నీరు గారిపోతున్నాయని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న విజయశాంతి... త్వరలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు