సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి పోస్ట్.. ఎవరిని ఉద్దేశించో తెలుసా?

సోమవారం, 15 జూన్ 2020 (10:11 IST)
sushanth singh
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ ప్రపంచాన్ని కుదిపేసింది. యువ హీరో ఇలా ఆత్మహత్యకు పాల్పడటం సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే సుశాంత్ రాజ్ పుత్ మరణానికి గల కారణాలేంటో ఇంకా తెలియరాని పరిస్థితుల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరిగా పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పోస్టు అందరిని కంటతడి పెట్టిస్తోంది.
 
ఇన్‌స్టాగ్రామ్‌లో జూన్ 3న తన తల్లిని స్మరించుకుంటూ సుశాంత్ చేసిన పోస్ట్ ఇది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. ''మసకబారిన గతం.. కన్నీరుగా జారి ఆవిరవుతోంది.. అనంతమైన కలలు చిరునవ్వును.. అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నానే అమ్మా..'' అంటూ తనలో సాగిన అంతర్మథనాన్ని కవిత రూపంలో రాశాడు.
 
 2002లో తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడే చనిపోయిన తన తల్లిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో సుశాంత్ ప్రేమతో పెట్టిన ఈ ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం అతడి ఆత్మహత్య నేపథ్యంలో వైరల్‌గా మారింది. కాగా, సరిగ్గా నాలుగు రోజుల కింద జూన్ 9న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 
 
సుశాంత్ సింగ్‌తో సహా మరో నలుగురు స్టార్స్ దగ్గర కూడా ఈమె మేనేజర్‌గా పని చేసింది. ఈమె ముంబైలోని మలాడ్‌లో తాను ఉంటున్న అపార్ట్‌మెంట్స్‌లోనే 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయిన ఐదు రోజులకే సుశాంత్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో ఈ రెండు మరణాలకు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు