జ‌యం ర‌వి, అర‌వింద్‌స్వామిల 'బోగ‌న్‌' ట్రైల‌ర్ టాక్ ఏంటి?

గురువారం, 1 అక్టోబరు 2020 (13:59 IST)
ఇటీవ‌ల 'బోగ‌న్' చిత్రాన్ని రామ్ తాళ్లూరి తెలుగులో అందిస్తున్నార‌నే ప్ర‌క‌ట‌న రాగానే, ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన అమేజింగ్‌ రెస్పాన్స్ చూశాక‌, ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నామ‌నే న‌మ్మ‌కం మ‌రింత‌గా పెరిగిందని నిర్మాత తెలిపారు.
 
'బోగ‌న్' చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌తో ఎస్.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ‌పైన ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి అందిస్తున్నారు. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ రోజు (గురువారం) ఉద‌యం 11 గంట‌ల‌కు బోగ‌న్ ట్రైల‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. సాధార‌ణంగా యాక్ష‌న్ సీన్లు టెర్రిఫిక్‌గా ఉంటాయంటాం. 
 
బోగ‌న్‌లో యాక్ష‌న్ సీన్లు మాత్ర‌మే కాదు, క‌థ‌ను న‌డిపించే అనేక సీన్లు టెర్రిఫిక్‌గా ఉంటాయ‌ని ఈ ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ట్రైల‌ర్‌ని చూస్తుంటే సినిమాలో మ‌న ఊహ‌కు అంద‌ని ట్విస్టులు అనేకం ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌యం ర‌వి త‌న ద‌గ్గ‌ర‌కు రివాల్వ‌ర్‌ ప‌ట్టుకొని వెరైటీగా న‌డుస్తూ వ‌స్తుంటే హ‌న్సిక ఫోన్‌లో ఏడుస్తూ "విక్ర‌మ్‌.. ఆదిత్య ఇక్క‌డ‌కు వ‌చ్చేశాడు.. భ‌యంగా ఉంది.. త్వ‌ర‌గా రా" అన‌డం, కారులో ఉన్న అర‌వింద్ స్వామి "వ‌స్తున్నా వ‌స్తున్నా" అన‌డం చూస్తుంటే ట్విస్టులు ఏ రేంజిలో ఉంటాయో అర్థ‌మ‌వుతోంది.
 
అలాగే ట్రైల‌ర్ చివ‌ర‌లో అర‌వింద్ స్వామి "ఆదిత్యా" అని కోపంతో పెద్ద‌గా అర‌వ‌డం కూడా ఈ ట్విస్టులో భాగ‌మే. ఎందుకంటే ఆదిత్య పాత్ర‌ను చేసింది అర‌వింద్ స్వామి అయితే, విక్ర‌మ్ పాత్ర‌ను చేసింది జ‌యం ర‌వి. మ‌రి జ‌యం ర‌విని చూసి హ‌న్సిక ఎందుకు భ‌య‌ప‌డుతోందో, అర‌వింద్ స్వామి "ఆదిత్యా" అని ఆవేశంగా ఎందుకు కేక పెట్టాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఒక బ్యాంక్ దొంగ‌త‌నం కేసును ద‌ర్యాప్తు చేస్తూ, ఆదిత్య అనే నిందితుడిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే విక్ర‌మ్ అనే పోలీసాఫీస‌ర్ క‌థ 'బోగ‌న్' చిత్రం.
 
త‌న‌కు చిక్క‌కుండా త‌ప్పించుకుంటున్న ఆదిత్య‌ను ఒక అద్భుత ప్లాన్‌తో విక్ర‌మ్ ప‌ట్టుకోవ‌డం టెర్రిఫిక్ ఇంట‌ర్వెల్ బ్లాక్‌. ఆ త‌ర్వాత క‌థ ప్రేక్ష‌కులు ఊహించ‌ని మ‌లుపులు తిరిగి, అనుక్ష‌ణం కుర్చీల‌లో మునివేళ్ల‌పై కూర్చోపెట్టేలా క‌థ‌నం ప‌రుగులు పెడుతుంద‌ని ట్రైల‌ర్ తెలియ‌జేస్తోంది. 
 
ల‌క్ష్మ‌ణ్ స్క్రీన్‌ప్లే, సౌంద‌ర్‌రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, డి. ఇమ్మాన్ మ్యూజిక్ క‌లిసి ఈ మూవీని ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా త‌యారుచేశాయి. విక్ర‌మ్ ఐపీఎస్‌గా జ‌యం ర‌వి, ఆదిత్య‌గా అర‌వింద్ స్వామి.. ఇద్ద‌రూ ఇద్ద‌రే అన్న‌ట్లు ఫెంటాస్టిక్‌గా న‌టించిన ఈ సినిమా ఒక హాలీవుడ్ థ్రిల్ల‌ర్ చూసిన ఫీలింగ్‌ను క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.
 
'త‌ని ఒరువ‌న్' త‌ర్వాత 'జ‌యం' ర‌వి, అర‌వింద్ స్వామి కాంబినేష‌న్‌లో రూపొంది సూప‌ర్‌హిట్ట‌యిన మ‌రో సినిమానే ఈ 'బోగ‌న్‌'. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీని డైరెక్ట‌ర్‌ ల‌క్ష్మ‌ణ్ రూపొందించారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా త‌మిళంలో రూ. 25 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది.
 
హీరోయిన్‌గా హ‌న్సికా మొత్వాని న‌టించిన ఈ చిత్రంలో నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, అక్ష‌ర గౌడ ఇత‌ర పాత్ర‌ధారులు. డి. ఇమ్మాన్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. త్వ‌ర‌లోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత‌ చెప్పారు. ఈ ట్రైలర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. సినిమా పై అంచనాలను పెంచేసిందని చెప్పచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు