ఇద్దరు యువతులకు అలాంటి సంబంధం.. పెళ్లి మాటెత్తే సరికి ఆత్మహత్య

మంగళవారం, 19 మే 2020 (17:46 IST)
ఇద్దరు మహిళల మధ్య లైంగిక బంధం ఆత్మహత్యకు దారితీసింది. భర్తకు దూరంగా వున్న వివాహిత (23 ఏళ్ళు), 20 ఏళ్ల మరో యువతికి మధ్య ఏర్పడిన స్నేహం.. లైంగిక బంధానికి దారితీసింది. అయితే వీరి బంధాన్ని తప్పుబట్టిన పెద్దలు యువతికి వివాహం చేయాలనుకున్నారు. కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదో ఏమో కానీ.. వివాహితతో పాటు యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని నామక్కల్ పట్టణంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల ఓ వివాహిత, మరో 20 ఏళ్ల యువతి పెరియమనాలిలోని ఓ మగ్గం పరిశ్రమలో కొన్ని నెలలుగా పనిచేస్తున్నారు. ఇద్దరికి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం కాస్తా లైంగిక బంధానికి దారితీసింది. లెస్బియన్స్‌గా వీరు మారిపోయారు. ఈ వ్యవహారం ఆ పరిశ్రమలో తెలియడంతో ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
 
వివాహిత భర్తతో మనస్పర్థలు రావడంతో అతనికి దూరంగా ఉంటోంది. ఆమెకు రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఆ యువతి కొట్టపాలయం ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుస్తుండేవారు. వీరి బంధం గురించి యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో వివాహితతో దూరంగా ఉండాలని ఆమెను హెచ్చరించారు.
 
అంతేకాదు, రాశిపురానికి చెందిన వ్యక్తితో యువతికి మే 27న పెళ్లి చేయాలని నిర్ణయించారు. గత శనివారం, యువతి ఆ వివాహిత ఇంటికి వెళ్లింది. అక్కడే యువతులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. ఇంకా ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు