సర్వభూపాల వాహ‌నంపై బ‌కాసుర వ‌ధ‌ అలంకారంలో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌ మలయప్ప

మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (20:01 IST)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగ‌ళ‌వారం రాత్రి 7.00 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై బ‌కాసుర వ‌ధ‌ అలంకారంలో దర్శనమిచ్చారు.
 
సర్వభూపాల వాహ‌నం - య‌శోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. 
 
వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
 
 ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీ గౌత‌మ్‌రెడ్డి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీమ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, డా.నిశ్చిత‌, శ్రీ శేఖ‌ర్ రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి అనంత‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.
 
కాగా బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన బుధ‌‌వారం ఉదయం 9 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీవారు భక్తులను కటాక్షించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు