పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త... ఏంటది?

మంగళవారం, 13 అక్టోబరు 2020 (09:34 IST)
దేశంలో పండుగ సీజన్ మొదలైంది. దీంతో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మొత్తాన్ని పండుగ అడ్వాన్సుగా చెల్లిస్తారు. తిరిగి నెలసరి వేతనంలో కత్తిరిస్తారు. 
 
కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పడిపోవటంతో కొనుగోళ్లకు ఊతమిచ్చేందుకు వీలుగా కేంద్రం ఈ తరహా కీలక నిర్ణయం తీసుకుంది. అంటే.. కేంద్ర ప్రభుత్వమే డబ్బులు మనతో పండుగ వేళ ఖర్చు చేయిస్తుంది. ఆ తర్వాత తిరిగి ఆ మొత్తాన్ని వేతనాల్లో కత్తిరిస్తుంది. 
 
ఇదే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, కేంద్రప్రభుత్వ ఉద్యోగులందరికీ పండుగ అడ్వాన్సుగా రూ.10,000 చొప్పున ఇస్తామని, ఆ మొత్తాన్ని పదివాయిదాల్లో ఉద్యోగి వేతనం నుంచి తిరిగి తీసుకుంటారని తెలిపారు.
 
అలాగే ఉద్యోగులకు ఇచ్చే ప్రయాణ భత్యానికి (ఎల్టీసీ) బదులుగా ఈ ఏడాది ఆదాయ పన్ను లేని నగదు వోచర్లు ఇస్తామన్నారు. 10 రోజులకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ సౌకర్యం కూడా అందిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఈ ప్రయోజనాలు పొందేవారు పలు షరతులకు లోబడి కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. 
 
మరోవైపు లాక్డౌన్‌ కారణంగా ఆదాయాలు పడిపోయి సతమతమవుతున్న రాష్ట్రాలకు రూ.12 వేలకోట్ల దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాలను కూడా నిర్మల ప్రకటించారు. ఈ రుణాల కాలపరిమితి 50 యేళ్లు. అలాగే దేశంలో మౌలిక వసతుల కల్పనకు రూ.25 వేల కోట్లు, కేంద్రం నిర్దేశించిన సంస్కరణలు అమలుచేసినందుకు మరో రూ.2వేల కోట్లు చొప్పున కేటాయించినట్టు ఆమె ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు