తోక ముడిచిన చైనా.. గాల్వాన్ లోయ నుంచి బలగాలు వెనక్కి?

సోమవారం, 6 జులై 2020 (13:40 IST)
తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయి చర్చలు ఎడతెరిపి లేకుండా సాగుతున్నాయి. వీటి ఫలితంగా చైనా బలగాలు గాల్వాన్ లోయ నుంచి రెండు కిలోమీటర్ల మేరకు వెనక్కి తగ్గినట్టు సమాచారం. 
 
 
తూర్పు గాల్వ‌న్‌ లోయ‌ వద్ద ఉద్రిక్తతలు నెలకొనేలా చైనా బలగాలు దుందుడుకు చర్యలకు పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నాయి. ఆ తర్వాత డ్రాగన్‌ చర్యలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. 
 
మరోవైపు, అంతర్జాతీయంగా భారత్‌కు పలు దేశాలు మద్దతిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య శాంతి కోసం భారత్‌తో చర్చల్లో పాల్గొంటోన్న చైనా సైన్యం గాల్వన్‌ లోయ వద్ద నుంచి దాదాపు 2 కిలోమీట‌ర్ల దూరం వెనక్కి వెళ్లిందని భారత ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు మీడియాకు తెలిపారు.
 
ఘర్షణ నెలకొన్న ప్రాంతం నుంచి భారత్‌ - చైనా తాత్కాలిక నిర్మాణాల‌ను తొల‌గించిన‌ట్లు ప్రభుత్వ వ‌ర్గాలు చెప్పాయి. అయితే, చైనా పారదర్శకంగా వ్యవహరిస్తుందా? మళ్లీ సైన్యాన్ని ముందుకు పంపుతుందా? అన్న విషయంపై తాము దృష్టి పెడతామని భారత అధికారులు వివరించారు.
 
ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక చర్యలకు సిద్ధమవుతున్న రీతిలో సరిహద్దు ప్రాంతాల్లో చర్యలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి జరిగిన చర్చల ఫలితంగా గాల్వ‌న్‌, పాన్‌గాంగ్ సో, హాట్ స్ప్రింగ్స్ నుంచి సైనికుల‌ను వెన‌క్కి పంపాల‌ని ఇటీవలే ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
 
దశల వారీగా ఇరు దేశాలు తమ సైన్యాన్ని వెనక్కు పిలిపించుకోవాలని భావిస్తున్నాయి. తొలి దశలో బలగాలను వెనక్కి పిలిపించిన తర్వాత.. చైనా సైన్యం నిజంగానే వెనక్కి వెళ్లిందా? అన్న అంశాన్ని నిర్ధారించుకుని, రెండో దశలో మరిన్ని బలగాలను ఉపసంహరించుకుంటామని భారత అధికారులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు