ఢిల్లీ టు లండన్‌ బస్సు : 18 దేశాలు.. 70 రోజుల జర్నీ.. టిక్కెట్ ఎంతో తెలుసా?

సోమవారం, 24 ఆగస్టు 2020 (20:20 IST)
ఈ వార్త వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే... ఏ ఒక్కరూ కలలో కూడా ఊహించివుండరు. ఎందుకంటే.. ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు సర్వీసు నడుపుతారని అనుకునివుండరు. కానీ ఢిల్లీకి చెందిన ఓ ట్రావెల్ సంస్థ ఈ సాహసానికి శ్రీకారం చుట్టబోతుంది. ఢిల్లీ టు లండన్‌ల మధ్య బస్సు సర్వీసును ప్రారంభించనుంది. 
 
ఈ బస్సు.. మొత్తం 18 దేశాల మీదుగా 70 రోజులపాటు ప్రయాణిస్తుది. మొత్తం 20 వేల కిలోమీటర్ల దూరం మేరకు ప్రయాణించనుంది. 'బస్ టు లండన్' పేరుతో ప్రారంభంకానున్న ఇది మామూలు ప్రయాణం కాదు.. సాహస యాత్ర. గురుగ్రామ్‌కు చెందిన అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ అనే ట్రావెల్ సంస్థ బస్ యాత్రకు శ్రీకారం చుట్టింది. అయితే, టిక్కెట్ ధర వింటే మాత్రం బైర్లు కమ్మాల్సిందే. ఎందుకంటే.. ఈ టిక్కెట్ ధర అక్షరాలా 15 లక్షల రూపాయలు.
 
యాత్రలో భాగంగా మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, చైనా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మీదుగా ప్రయాణం సాగుతుంది. 20 మంది మాత్రమే ప్రయాణించే వీలున్న ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, సహాయకుడు ఉంటారు. 
 
ఈ బస్సులో ప్రయాణించాలనుకునే వారికి వీసా, భోజన, వసతి సదుపాయాల నుంచి అన్నింటినీ ట్రావెల్ సంస్థే చూసుకుంటుంది. నిజానికి ఈ ఏడాది మే 21నే ప్రయాణం ప్రారంభించాల్సి ఉండగా, కరోనా కారణంగా బ్రేక్ పడింది. కానీ, కరోనా పరిస్థితులు చక్కబడుతుండటంతో ఈ బస్సు సర్వీసు మళ్లీ తెరపైకి వచ్చింది. 2021నాటికి ఈ బస్సు సర్వీసు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఈ బస్సు దాదాపు 18 దేశాలగుండా ప్రయాణిస్తుందని, ప్రయాణికులకు ఇదో గొప్ప అనుభూతిగా మిగులుతుందని చెప్పుకొచ్చింది.
 
అయితే, ఢిల్లీ టు లండన్‌ల మధ్య విమాన ప్రయాణం 10 నుంచి 15 గంటలు మాత్రమే. టిక్కెట్ కూడా రూ.4 లక్షలు వరకు ఉండొచ్చు. కానీ బస్సులో ప్రపంచాన్ని చుట్టిరావాలనుకునే ట్రావెల్ లవర్స్‌కు మాత్రం ఇదో గొప్ప అనుభూతిగా మిగిలిపోతుంది. ఆ ట్రావెల్ కంపెనీ ఇదే మాట చెబుతోంది మరి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు