దేశ ప్రజలకు శుభవార్త.. ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్

శుక్రవారం, 3 జులై 2020 (09:56 IST)
కరోనా వైరస్ మహమ్మారితో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు ఓ శుభవార్త. ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్‌లు సంయుక్తంగా ప్రకటించాయి. 
 
ఈ వ్యాక్యిన్‌వు క్రియారహిత వైరస్ ఆధారంగా తయారు చేస్తున్నట్టు తెలిపారు. ఇది జంతువుల్లో పూర్తి సత్ఫలితాలను ఇవ్వగా, నేడో, రేపో మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభంకానున్నాయని పేర్కొన్నాయి. 
 
కాగా, క్లినికల్ ట్రయల్స్ కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 12 ఇనిస్టిట్యూట్‌లను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. ఈ కేంద్రాల్లో వ్యాక్సిన్ పనితీరును పరిశీలిస్తామని, అన్ని క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు తొలివారం నాటికి పూర్తవుతాయని తెలియజేశాయి.
 
ఈ విషయాన్ని ఐసీఎంఆర్, తన భాగస్వాములందరికీ తెలియజేసింది. ఈ మేరకు ఓ లేఖ రాసిన ఐసీఎంఆర్, ఎంపిక చేసిన కేంద్రాలు క్లినికల్ ట్రయల్స్‌కు సన్నద్ధమవ్వాలని సూచించింది. త్వరితగతిని ట్రయల్స్‌ను పూర్తి చేసి, ఫలితాల వివరాలను అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. దీన్ని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణించాలని కోరింది. ఈ వ్యాక్సిన్‌ను ఐసీఎంఆర్, పూణెలోని వైరాలజీ ల్యాబ్ సహకారంతో భారత్ బయోటెక్ తయారు చేసింది. 
 
కాగా, వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పూర్తి ఫలితాలు సంతృప్తికరంగా ఉంటేనే వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య రంగంలోని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. లక్ష్యాలను చేరుకునేందుకు బీబీఐఎల్ చేస్తున్న కృషిని అభినందిస్తూనే, ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు