ఆ 52 చైనా మొబైల్ యాప్స్‌ను వాడొద్దంటూ నిఘా వర్గాలు సూచన

గురువారం, 18 జూన్ 2020 (15:20 IST)
చైనా మొబైల్ యాప్‌ల వాడకం ప్రమాదకరం. చైనాకు చెందిన 52 మొబైల్ అప్లికేష‌న్ల‌పై నిషేధం విధించాల‌ని, లేదా ప్ర‌జ‌లు వాటిని వాడ‌కుండా చూడాల‌ని నిఘా వర్గాలు బుధ‌వారం కేంద్రానికి సిఫార‌సు చేసాయి.
 
 వీటి వ‌ల్ల దేశ భ‌ద్ర‌త‌కే ముప్పు ఉంద‌ని హెచ్చ‌రికలు జారీ చేసాయి. చైనాతో లింక్ ఉన్న యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగించ‌డం ద్వారా డేటా చోరీకి గురయ్యే అవ‌కాశం ఉంద‌ని నిఘా విభాగం అధికారులు వెల్లడించారు.
 
భ‌ద్ర‌తా సంస్థ‌కు చెందిన సిబ్బంది ఎవ‌రూ వీటిని వినియోగించ‌రాద‌ని సూచన చేసాయి. జూమ్, టిక్‌టాక్, యూసీ బ్రౌజ‌ర్, జెండ‌ర్, షేర్ఇట్, క్లీన్ మాస్ట‌ర్ స‌హా 52 ఇత‌ర మొబైల్ అప్లికేష‌న్ల ద్వారా డేటా త‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంద‌ని ఓ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి నిఘా విభాగం స‌మ‌ర్పించింది.
 
ఈ నివేదిక‌పై ఇప్ప‌టికే “జాతీయ భద్రతా మండలి” సానుకూలంగా స్పందించిందని, దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఓ అధికారి వెల్ల‌డించారు. “జూమ్‌ వీడియో కాలింగ్” యాప్ ద్వారా వినియోగ‌దారుల గోప్య‌త‌కు ముప్పు ఉంద‌ని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్ర‌క‌ట‌న చేసింది.
 
ప్ర‌భుత్వ స‌మావేశాలకు ఈ యాప్‌ని వినియోగించ‌రాదంటూ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. “జూమ్ యాప్” వాడ‌కంపై ప‌లు దేశాలు ఇప్ప‌టికే ఆంక్షలు విధించ‌గా, కొన్ని దేశాల్లో పూర్తిగా నిషేధం కొన‌సాగుతుంది. జ‌ర్మనీలో ఈ యాప్‌పై ఆంక్షలు విధించ‌గా, తైవాన్‌లో పూర్తిగా “జూమ్” వాడ‌రాదంటూ ప్ర‌భుత్వం నిషేధం పెట్టింది. అమెరికా కూడా సెనేట్ సభ్యులను “జూమ్ యాప్” కాకుండా ఇత‌ర సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ యాప్‌ల‌ను ఉప‌యోగించాల‌ని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు