కార్గిల్ యుద్ధానికి 21 ఏళ్లు.. భారత్‌కు చెందిన ఒక్క అంగుళం భూభాగాన్ని వదులుకోం..

ఆదివారం, 26 జులై 2020 (10:42 IST)
కార్గిల్ యుద్ధం ముగిసి నేటికీ 21 ఏళ్ళు పూర్తయింది. ప్రతి ఏడాది జులై 26వ తేదీన ఇండియా కార్గిల్ విజయ్ దివాస్‌ను జరుపుకుంటుంది. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు దేశం నివాళులు అర్పిస్తుంది. భారత్ శాంతిని కోరుకుంటుంది. శాంతి కోసమే కార్గిల్ యుద్ధం చేసినట్టు భారత ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. భారత్‌కు చెందిన ఒక్క అంగుళం భూభాగం కూడా వదులుకోబోమని ఇండియా స్పష్టం చేసింది. 
 
భారత ఆర్మీ ప్రాణాలను పణంగా పెట్టి ద్రాస్ సెక్టార్ కోసం పోరాటం చేసింది. జులై 7వ తేదీన ఇండియన్ ఆర్మీ బతాలిక్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది. జులై 14 వరకు పాక్ ఆర్మీని తిరిగి వెనక్కి తరిమికొట్టింది. జులై 26 వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసినట్టు ప్రకటించింది.
 
కార్గిల్ యుద్ధం ఎలా ప్రారంభమైంది... 
1999 మే 3వ తేదీన కార్గిల్‌లో తెలియని అలజడి మొదలైంది. శత్రుమూకలు దేశంలోని కార్గిల్ సెక్టార్‌లోకి ప్రవేశించారని నిఘావర్గాల హెచ్చరికతో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయ్యి కేంద్రానికి సమాచారం అందించింది. అయితే, కేంద్రం పాక్ ఆర్మీకి, ఉగ్రవాదులకు హెచ్చరికలు చేస్తూనే ఉంది. కానీ, పాక్ వాటిని పట్టించుకోలేదు. 
 
మే 10వ వరకు పని సైన్యం కార్గిల్ చుట్టుపక్కల ప్రాంతాలైన ద్రాస్, కస్కర్, ముస్కో సెక్టార్లలోకి చొరబడినట్టు గుర్తించారు. ఆలస్యం చేస్తే పాక్ సైన్యం కార్గిల్ సెక్టార్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో మే 26 వ తేదీన భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు వాయుసేన రంగంలోకి దిగి శత్రువులపై దాడి చేసింది.
 
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపుదాడితో పాక్ సైన్యం కకావికలం అయ్యింది. 1999 జూన్ 13వ తేదీన ఇండియన్ ఆర్మీ కీలకమైన ద్రాస్ సెక్టార్‌లో యుద్ధం చేయడం ప్రారంభించింది. ఆ తరువాత జులై 4వ తేదీన టైగర్ హిల్స్‌ను ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. 
 
దాదాపుగా 11 గంటలపాటు హోరాహోరీ యుద్ధం జరిగింది. జులై 5 వ తేదీన ద్రాస్ సెక్టార్‍‌ను ఇండియా చేజిక్కించుకుంది. ఇలా జులై 26వ తేదీన ఈ యుద్ధం ముగిసింది. ఇంకా భారత ఆర్మీ ఈ యుద్ధంలో విజయం సాధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు