కూతుళ్ళను అర్థనగ్నంగా పడుకోబెట్టి చంపి.. బతికే ఉన్నారంటూ పోలీసులతో చెప్పారు

సోమవారం, 25 జనవరి 2021 (22:32 IST)
అతనికి కూతుళ్ళంటే ఎంతో ఇష్టం. అల్లారుముద్దుగా కూతుర్లను చూసుకునేవాడు. ఉన్నత చదువులు చదివించాడు. అతను ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఆయన భార్య కూడా ఉన్నత విద్యావంతురాలు. అయితే ఇద్దరూ కలిసి తమ పిల్లలను అతి దారుణంగా చంపేశారు. అది కూడా అర్థనగ్నంగా పడుకోబెట్టి.. వారిని అతి దారుణంగా చంపి శవాల మీదే కూర్చున్నారు. తమ కూతుళ్ళు చనిపోలేదంటూ పోలీసులకు చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. 
 
చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. పురుషోత్తంనాయుడు, పద్మజ ముద్దుల కుమార్తెలు అలేఖ్య, దివ్య. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. మదనపల్లె రూరల్ మండలం శివనగర్‌లో నివాసముంటున్నారు. బాగా స్థిరపడ్డ ఫ్యామిలీ. 
 
అయితే తల్లిదండ్రులకు దైవ భక్తి ఎక్కువ. ముఖ్యంగా బాబాలను నమ్మడం వీరికి అలవాటు. ఉన్నత చదువులు చదువుకున్న పురుషోత్తం నాయుడు మదనపల్లె ఉమెన్స్ కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. పద్మజ కూడా ప్రైవేటు కళాశాలకు ప్రిన్సిపల్‌గా ఉంది. కూతుళ్ళు ఇద్దరినీ ఉన్నత చదువులు చదివించారు.
 
అయితే బాబాలను నమ్మి ఆస్థి బాగా సంపాదించడంతో పురుషోత్తం నాయుడు, పద్మజ బాబా చెప్పే మాటలను వినడం మొదలుపెట్టారు. ఇలా ఎన్నోసార్లు బాబా చెప్పిన మాటలన్నీ నిజం కావడంతో అదే పని చేయడం ప్రారంభించారు. యుగాంతం అంతమొందుతోందని.. అందుకే కూతుళ్ళను అర్థనగ్నంగా పడుకోబెట్టి పొట్టపై గట్టిగా కొడితే వారు చనిపోతారని.. కానీ ఉదయానికల్లా తిరిగి బతుకుతారని బాబా చెప్పాడట.
 
దీంతో తల్లిదండ్రులు అదే పని చేయడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు ఏమీ చేయలురే అనుకున్న ఆ అక్కాచెల్లెళ్ళకు చివరకు ప్రాణాలే పోయాయి. అక్కను ఒక గదిలో ఉంచి ఆమెకు సగం గుండు గీశారు. ఆ తరువాత అర్థనగ్నంగా పడుకోబెట్టారు. అంతటితో ఆగలేదు పడుకొని ఉన్న ఆ యువతి నోట్లో తీర్థమంటూ రాగి చెంబు ఉంచి ఢమరుకంతో కొట్టారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.
 
ఆ తరువాత భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ యువతి పొట్టపై పలుసార్లు గట్టిగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె చనిపోయింది. అలాగే పక్కగదిలోకి వెళ్ళారు. రెండవ కుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళి ఆమెను పడుకోబెట్టి పొట్టపై కొట్టడంతో ఆమె కూడా చనిపోయింది. ఆ తరువాత పురుషోత్తం నాయుడు తన స్నేహితుడికి ఫోన్ చేశారు.
 
కలియుగం అంతమై పోతుంది.. కానీ నా బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు.. వారు మాత్రమే బతికి ఉంటారని చెప్పాడు. దీంతో ఆ అధ్యాపకుడు నిశ్చేష్టుడయ్యాడు. నేరుగా పోలీసులకు ఫోన్ చేశాడు. అక్కడకు వచ్చిన పోలీసులు ఆ ఘటన చూసి చలించిపోయారు. అసలేం జరిగిందో తెలియక అయోమయంలో ఉండిపోయారు.
 
తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. బాబా చెప్పిన మాటలు విని చివరకు కన్నకూతుళ్ళను పొట్టనబెట్టుకోవడం మాత్రం అక్కడి కాలనీ వాసులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు