అప్పుడు ఆ పని చేసాడు, ఇప్పుడు తిరుపతి ఎంపి సీటు సంపాదించాడు, ఎవరు?

శుక్రవారం, 20 నవంబరు 2020 (22:37 IST)
ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరిగేది తిరుపతి పార్లమెంటు స్ధానం గురించే. తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఆ సీటు కాస్త ఖాళీ అయ్యింది. గతంలో ఒక ప్రజాప్రతినిధి చనిపోతే ఏకగ్రీవం చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు.
 
ఎలాగైనా ఎన్నికల్లోకి వెళ్ళాలన్న నిర్ణయించుకున్నారు. మొదటగా టిడిపి నుంచి మాజీ కేంద్రమంత్రి పనబాకలక్ష్మి పేరును ఖరారు చేశారు. ఆ తరువాత ఈరోజు వైసిపి నుంచి గురుమూర్తి పేరును అధికారికంగా ప్రకటించారు. అసలు ఈ గురుమూర్తికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. 
 
సాధారణ ఫిజియోథెరపిస్ట్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పుడు ఫిజియోథెరపీ చేసి కాళ్ళ నొప్పులను తగ్గించాడు. అలా జగన్ మోహన్ రెడ్డికి బాగా దగ్గరయ్యారు. గురుమూర్తి ఫిజియోథెరపీ చేసినప్పుడు జగన్ ప్రతిపక్షనేత. కానీ ఇప్పుడు సిఎం కదా. 
 
తిరుపతి ఎంపి సీటు ఖాళీ కావడంతో గురుమూర్తి సిఎంను కలిశారు. తన మనస్సులోని మాటను చెప్పారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆ సీటును గురుమూర్తికే ఖరారు  చేశారట. నిన్నే ఈ విషయాన్ని స్థానిక నాయకులకు చెప్పారట. మీరు అతని గెలుపు కోసం ప్రయత్నించండి అంటూ చెప్పారట సిఎం జగన్మోహన్ రెడ్డి. కొత్త ముఖం కావడంతో గురుమూర్తి గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు