భారత గడ్డపై ఎయిరిండియా వన్ : బోయింగ్ 777 ప్రత్యేకతలేంటి?

గురువారం, 1 అక్టోబరు 2020 (18:36 IST)
భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణాల కోసం ఉద్దేశించిన అత్యాధునిక విమానం ఎయిరిండియా వన్ భారత గడ్డను ముద్దాడింది. అమెరికా నుంచి వచ్చిన ఈ విమానం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. గురువారం మధ్యాహ్నం 3.11 గంటలకు ఈ విమానం భారత గడ్డపై దిగినట్టు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ విమానానికి ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. కాగా, అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ ఈ అత్యాధునిక విమానాన్ని తయారు చేసింది. 
 
అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం తరహాలో భారత్‌కు కూడా ఓ విమానం ఉండాలన్న ఆలోచనతో కేంద్రం ప్రముఖ విమాన తయారీదారు బోయింగ్ సంస్థకు ఈ విమానం తయారీ ఆర్డర్ ఇచ్చింది. ఇలాంటివే రెండు విమానాలు అందించాలని పేర్కొంది. ఈ క్రమంలో ఎయిరిండియా సంస్థ తన వద్ద ఉన్న రెండు బీ-777 విమానాలను ఆధునికీకరణ కోసం డల్లాస్‌లోని బోయింగ్ తయారీ కేంద్రానికి పంపింది.
 
భారత ప్రభుత్వ పెద్దల అవసరాలకు తగిన విధంగా బోయింగ్ సంస్థ ఓ బీ-777 విమానాన్ని ఎయిరిండియా వన్ విమానంగా తీర్చిదిద్దింది. ఇలాంటిదే మరో విమానాన్ని కూడా భారత్‌లో వీవీఐపీల ప్రయాణాల కోసం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి తొలి విమానం గత ఆగస్టులోనే భారత్‌కు రావాల్సివుంది. కానీ, కొన్ని సాంకేతిక కారణావల్ల అది సాధ్యపడలేదు. 
 
కాగా, ఎయిరిండియా వన్ విమానంలో క్షిపణి దాడులను ఎదుర్కొనేందుకు అవసరమైన అధునాతన వ్యవస్థను అమర్చారు. ఈ విమానంలో ఎంతో సమర్థవంతంగా పనిచేసే కమ్యూనికేషన్, నేవిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. విశాలమైన కార్యాలయం, సమావేశ మందిరాలు, అత్యవసర సమయాల్లో అందించే వైద్య సేవలు ఎయిరిండియా వన్‌లో ఏర్పాటు చేశారు. ఈ విమానం ఒక్కసారి ఇంధనం నింపుకుంటే భారత్ నుంచి అమెరికాకు ఎక్కడా ఆగకుండా ప్రయాణించగలదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు