కరోనా వైరస్ భారత్‌లో 20 కోట్ల మందికి వచ్చి పోయిందట... ఐసీఎంఆర్ సర్వే

గురువారం, 1 అక్టోబరు 2020 (14:29 IST)
ప్రపంచాన్ని ఓ కుదుపు కుదుపుతున్న కరోనా వైరస్ మన దేశంలో కూడా స్వైర విహారం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పటికు దేశంలో 20 కోట్ల మందికి వచ్చి వెళ్లిందట. ఈ విషయం ప్రభుత్వ ఆధీకృత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చేపట్టిన సర్వేలో తేలింది. 
 
అదీ కూడా ఆగస్టు నాటికి దాదాపు 20 కోట్ల మందికి కరోనా వైరస్ సోకి తగ్గిపోయిందని వెల్లడైంది. దేశంలో పెద్ద ఎత్తున విరుచుకుపడినట్లు ఐసిఎంఆర్ సమగ్రరీతిలో జరిపిన రక్తనమూనా సర్వే తరువాతి గణాంకాలతో ఇప్పుడు స్పష్టం అయింది. ఆగస్టు నాటికి దేశంలో 15.9 కోట్ల నుంచి 19.6 కోట్ల మందికి కరోనా సోకిందని ఐసిఎంఆర్ జరిపిన అధ్యయనం తర్వాతి నివేదికతో వెల్లడైంది. 
 
ఇక 10 ఏళ్లుపైబడిన వారిలో కనీసం ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా సోకినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటికీ కోవిడ్ సోకకుండా ఉన్న అత్యధికులలో ఇది వ్యాపించే ముప్పు కూడా ఉందని ఐసిఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకూ వైరస్ నుంచి ఏదో విధంగా కాపాడుకుంటూ వస్తున్న వారిలో అత్యధికులలో వైరస్ వస్తుందని తెలిపారు. 
 
ఇది చాలా దారుణమైన రిస్క్ అవుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రామాణిక ఐసిఎంఆర్ నిర్వహించిన రెండో జాతీయ స్థాయి సర్వేలో పలు ఇప్పటికీ వెలుగులోకి రాని విషయాలు స్పష్టం అయ్యాయి.. కోటానుకోట్ల మందికి కరోనా సోకి వెళ్లిపోయిందని అధ్యయనంలో కనుగొన్నారు. ఈనెల 17 నుంచి 22వ తేదీ మధ్యకాలంలో ఐసిఎంఆర్ ఈ సర్వే నిర్వహించింది. 
 
ముఖ్యంగా దేశంలోని మురికివాడలలోనే ఎక్కువగా వైరస్ వ్యాపించింది. ఇతర ప్రాంతాలను పోలిస్తే స్లమ్స్ ఎక్కువగా వైరస్ కాటుకు గురైంది. గ్రామీణ ప్రాంతాలలో వైరస్ ప్రభావం తక్కువగా ఉంది. పల్లెలతో పోలిస్తే సగటు గణాంకాల మేరకు పరిశీలించుకుంటే పట్టణ, నగర భారతంలో వైరస్ నాలుగింతలు ఎక్కువగా ఉంది.
 
అయితే పలు ప్రాంతాలలో గుట్టుచప్పుడు కాకుండా కరోనా వైరస్ సోకి సాధారణ చికిత్సలోనే నయం అయిన కేసులు అత్యధికంగా ఉన్నారు. స్లమ్స్‌లో 15.6 శాతం, స్లమ్సేతర ప్రాంతాలలో 8.2 శాతం మందికి కరోనా వైరస్ వచ్చింది. తొలి సీరం సర్వే జరిపిన 21 రాష్ట్రాలకు చెందిన 70 జిల్లాల్లోనే ఇప్పుడు కూడా సర్వే జరిగింది. తొలి సర్వేను మే 11 నుంచి జూన్ 4వ తేదీ మధ్యలో నిర్వహించారు. ఇంతకుముందు 28,000 మంది రక్తనమూనాలను సేకరించారు. ఈసారి 29వేలకు పైగా మందిసీరం పరీక్షలు జరిగాయి. 
 
ముంబైలో అత్యధికంగా మురికివాడల్లోనే వైరస్ సోకిన విషయం ఇప్పటి సీరం పరీక్షలతో స్పష్టం అయింది. అక్కడ 57.8 శాతానికి పైగా వైరస్ పాజిటివ్ లక్షణలు కన్పించాయి. తరువాతి స్థానంలో ఢిల్లీలో 29.1 శాతం రికార్డు అయింది. కరోనా వైరస్ మగ ఆడ తేడా లేకుండా అందరిలో వ్యాపిస్తోందని, వస్తున్న శీతాకాలంలో మరింతగా వైరస్ సంక్రమించే వీలుందని సర్వే దశలో స్పష్టం అయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు