మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కేను పోలీసులు ఎన్కౌంటర్ చేశారనే సందేహాలను మావో సానుభూతిపరులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 27 మంది నక్సలైట్లు హతమైన విషయం తెల్సిందే. ఈ ఎన్కౌంటర్లో ఆర్కే గాయపడ్డారనే సమాచారం దాదాపుగా ధ్రువీకరణైంది. అయితే, ఇప్పటిదాకా ఆయన పార్టీ కాంటాక్ట్లోకి వెళ్లకపోవడంతో, ఆయన ఎక్కడున్నారు? ఏ స్థితిలో ఉన్నారు? అనే అంశంపై విస్తృతమైన చర్చలు, ఊహాగానాలు సాగుతున్నాయి.
ఆర్కే పోలీసుల బందీగా ఉన్నారని హరగోపాల్లాంటి హక్కుల నేతలు సైతం అనుమానాలు వెలిబుచ్చుతుండటం గమనార్హం. మరోవైపు, గాయపడినవారు లొంగిపోతే వైద్యం చేయించడానికి సిద్ధమని పోలీసులు వ్యూహాత్మక ఎత్తుగడను అమలు చేస్తున్నారు. దీంతో ఆర్కే యోగక్షేమాలపై పార్టీ వర్గాలు, ప్రజా సంఘాలు, సానుభూతిపరులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి.
కాల్పులు జరుగుతుండగానే ఆర్కేను ఆయన గన్మెన్ తీసుకెళ్లారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలోనే ముగ్గురు గన్మెన్ కూడా మరణించారని పేర్కొంటున్నాయి. ఆ ముగ్గురిలో ఒకరి పేరును ప్రకటించారు. పోలీసుల వద్ద మరో వ్యక్తి సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద ఆర్కే సజీవంగా ఉన్నారా చనిపోయారా అనే అంశంపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.