విడాకులతో విడిపోయారు...కానీ కరోనా కలిపేసింది..

గురువారం, 26 మార్చి 2020 (13:14 IST)
విడాకులతో విడిపోయిన జంటను కరోనా కలిపేసింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అతని భార్య సుసానే ఖాన్ విడాకుల కారణంగా కొద్ది రోజుల నుండి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. హృతిక్‌​- సుసానే 2000 సంవత్సరంలో డిసెంబర్‌ 20న వివాహం చేసుకోగా, 2013 నుంచి దూరంగా ఉంటున్నారు. చివరికి 2014లో విడాకులు తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో వీరి కుమారులు హ్రేహాన్‌, హ్రిధాన్ కోసం అప్పుడప్పుడు కలిసి విహారయాత్రలకి వెళుతున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన తమ పిల్లల క్షేమ రక్షణ కోసం సుసానే ఖాన్ తిరిగి తన మాజీ భర్త ఇంటికి చేరుకుందట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయాన్ని హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా తెలిపాడు.
 
దేశంలో లాక్ డౌన్ విధించిన సమయంలో తల్లిదండ్రులుగా ఒకే చోట కలిసి ఉండడం అస్సలు ఊహించలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. కరోనాని కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటిస్తూ ప్రపంచమంతా ఏకతాటిపై రావడం బాగుంది. మానవత్వం వెల్లివిరుస్తున్న తరుణంలో అందరు కలిసికట్టుగా ఉండడం ఎంతో ముఖ్యం. మీరు చూస్తున్నది నా మాజీ భార్య సుసానే ఖాన్ ఫోటోనేనని హృతిక్ రోషన్ వెల్లడించాడు. 
 
ఈమె ఎంతో దయగల వ్యక్తి. ఈ సమయంలో పిల్లలకి దూరంగా ఉండకూడదని తనకు తానుగా ఇక్కడికి చేరుకుందని హృతిక్ రోషన్ తెలిపాడు. కో-పేరెంటింగ్‌లో ఎంతగానో సహకరిస్తున్న సుసానేకి ధన్యవాదాలు తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు