నేపియర్ వన్డే : టీం ఇండియా స్కోరు 207/3

టీం ఇండియా-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో... డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని.. 77 పరుగులతో వెనుదిరిగాడు. నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. టీం ఇండియా 31.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది.

భారత కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. దాంతో నిర్ణీత ఓవర్లను 50 నుంచి 39 ఓవర్లకు కుదించారు. అంతకుముందు, భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఓపెనర్లుగా బరిలోకి దిగిన సెహ్వాగ్, టెండూల్కర్‌లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. 56 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో వీరూ 77 పరుగులతో పెవిలియన్ చేరగా... 23 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు సాధించిన సచిన్ బట్లర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి దిగిన కెప్టెన్ ధోనీ 72 బంతుల్లో 5 ఫోర్లతో 63 పరుగులు సాధించి, ప్రస్తుతం సురేష్ రైనా (49)తో కలిసి క్రీజులో ఉన్నాడు.

కెప్టెన్‌తో జతకట్టిన యువరాజ్ సింగ్ కేవలం రెండు పరుగులకే రనౌట్‌తో వెనుదిరిగాడు. కివీస్ బౌలర్లలో బట్లర్, విటోరీలకు చెరో వికెట్ లభించింది. బట్లర్, బ్రియాన్‌‌లు చెరో మేడిన్ ఓవర్‌తోపాటు 36, 38 పరుగులను ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి