భారత్ దూకుడుకు వరుణుడు అడ్డుకట్ట

శుక్రవారం, 6 మార్చి 2009 (09:15 IST)
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం వెల్లింగ్టన్‌లో ప్రారంభమైన రెండో వన్డేకూ వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో భారత్ స్కోరు వికెట్ నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌ను నిలిపి వేశారు. అంతకుముందు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరుసగా రెండో సారి టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

భారత ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. జట్టు స్కోరు 76 పరుగుల మీద ఉండగా, బుట్లర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే సెహ్వాగ్ 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో సుడిగాలి ఇన్నింగ్స్‌తో 54 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సచిన్ కూడా అదే ఊపును కొనసాగించి, అర్థ సెంచరీ సాధించాడు. సెహ్వాగ్ అవుట్‌తో క్రీజ్‌లోకి వచ్చిన గంభీర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు.

19వ ఓవర్ పూర్తయ్యే సమయానికి వర్షం పడటంతో భారత్ వికెట్ నష్టానికి 130 పరుగుల చేయగా, సచిన్ (59), గంభీర్ (13) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి వన్డేలో బరిలోకి దిగిన జట్టునే రెండో వన్డేలో కూడా కొనసాగించారు. ఇరు జట్ల వివరాలు..

భారత జట్టు.. సెహ్వాగ్, సచిన్, గంభీర్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ధోనీ, పఠాన్, ప్రవీణ్ కుమార్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్.

కివీస్ జట్టు.. రైడర్, మెక్‌కల్లమ్, గుప్తిల్, టేలర్, ఇలియట్, ఓరమ్, మెక్‌గల్షన్, వెట్టోరి, బుట్లర్, ఒబ్రియన్, మిల్స్.

వెబ్దునియా పై చదవండి