శ్రీలంక జట్టుపై లాహోర్లో జరిగిన కాల్పుల నేపథ్యంలో... తమ దేశ క్రికెటర్లకు బీమా సౌకర్యం కల్పించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సి) ముందుకొచ్చింది. కాగా, ఈ దాడుల్లో ఏడుగురు క్రికెటర్లు, ఒక అసిస్టెంట్ కోచ్ గాయపడిన సంగతి విదితమే.
జట్టు సమిష్టిగా ప్రయాణిస్తున్నప్పుడు.. వైద్యపరంగా, వ్యక్తిగత ప్రమాదాలకు వర్తించే పాలసీ కోసం చూస్తున్నట్లు ఎస్ఎల్సీ ప్రకటించింది. ఈ మేరకు ఎస్ఎల్సి... లంక క్రికెటర్లకు బీమా కల్పించేందుకుగానూ బిడ్లను ఆహ్వానించింది.
ఈ సందర్భంగా ఎస్ఎల్సి అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ పేరీరా మీడియాతో మాట్లాడుతూ... తమ క్రికెట్ జట్టుకు రూ 1.75 కోట్లకు గతంలో చేసిన ప్రయాణ బీమా మార్చి నెల 13వ తేదీతో పూర్తి కాబోతోందనీ, వచ్చే ఏడాదికి ప్రయాణ బీమాతో పాటు.. మెడికల్, వ్యక్తిగత ప్రమాదాలకు కూడా బీమా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, దీనికోసమే బిడ్లను ఆహ్వానించామని వెల్లడించాడు.