జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీం ఇండియా ఎప్పటికీ ప్రమాదకారిగానే ఉంటుందని.. న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ విటోరీ వ్యాఖ్యానించాడు. రెండు ట్వంటీ20 మ్యాచ్లలో గెలుపొందినప్పటికీ.. తాము ప్రత్యర్థి జట్టును అంత తక్కువగా అంచనా వేయటం లేదని అన్నాడు.
ట్వంటీ20 సిరీస్ విజయంతో జట్టుకు మంచి ఊపును, ఉత్సాహాన్ని ఇచ్చినప్పటికీ... టీం ఇండియాపట్ల తగు జాగరూకతతోనే మెలగుతున్నామని విటోరీ పేర్కొన్నాడు. అయితే, మంగళవారం ప్రారంభం కానున్న వన్డే సిరీస్ సిరీస్లో టీం ఇండియా పుంజుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశాడు.
వెనువెంటనే పుంజుకునే సామర్థ్యం టీం ఇండియా సొంతమనీ... వాళ్లు స్వేచ్ఛగా క్రికెట్ ఆడతారనీ విటోరీ ఆందోళనతో కూడిన సంతోషం వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్లు ఒక్కసారి గాడిలో పడినట్లయితే, ఇక వాళ్లను ఆపటం చాలా కష్టసాధ్యమైన విషయమని విటోరీ చెప్పాడు. ప్రస్తుతానికి తమకు ట్వంటీ20 విజయాలే ఆత్మవిశ్వాసాన్నిస్తున్నాయన్నాడు.
తాము ఇంకా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తూ, ముందుకెళ్ళాల్సి ఉంటుందనీ... టీం ఇండియాను అన్నివేళలా కొంత ఒత్తిడిలో ఉంచాలని వెటోరీ తెలిపాడు. ఎందుకంటే... ఆ జట్టులో చాలామంది ప్రతిభావంతమైన ఆటగాళ్ళున్నారనీ.. బ్యాటింగ్ శక్తితో వారు వెంటనే పుంజుకునే అవకాశం ఉందని అన్నాడు. ఇక ట్వంటీ20లో లేని మాస్టర్ బ్లాస్టర్ జట్టులో చేరడంతో టీం ఇండియా వన్డేలలో ఖచ్చితంగా లబ్ది పొందుతారని విటోరీ చెప్పాడు.
సచిన్ రావడమే కాదు... తనతోపాటు అపారమైన అనుభవాన్ని తీసుకొస్తాడని విటోరీ తెలియజేశాడు. కివీస్లో గతంలో పర్యటించిన ఆయనకు ఇక్కడి పరిస్థితులపై తప్పకుండా అవగాహన ఉంటుందనీ.. ఆ అనుభవంతోనే జట్టును నడిపిస్తాడనీ అన్నాడు. అంతకంటే మించి ప్రపంచ క్రికెట్లోనే గొప్ప బ్యాట్స్మెన్ అయిన సచిన్ రాకతో టీం ఇండియాలో ఖచ్చితంగా మార్పు గోచరిస్తుందని విటోరి పేర్కొన్నాడు.