పూజా ఫలం.. అమృత తుల్యం.. వెలగ పండు

శుక్రవారం, 18 సెప్టెంబరు 2015 (16:11 IST)
ఓ బొజ్జగణపయ్యకు అత్యంత ఇష్టమైన, ప్రీతిపాత్రమైన పండ్లు వెలగ. నేరేడు. అందుకే కార్యసిద్ధికీ లక్ష్మీకటాక్షానికీ చేసేగణపతి హోమాల్లో వెలగపండును ఖచ్చితంగా ఉపయోగిస్తారు. వినాయక చవితినాడు కూడా గణపతికి సమర్పించే 21 రకాల పండ్లలో వెలగ తప్పనిసరిగా ఉంటుంది. నిజానికి వెలగపండులేని వినాయక చవితిని పండుగను ఊహించలేం.
 
గణపతికి ప్రీతిపాత్రమైన వెలక్కాయలు పాలవెల్లి అలంకారంగానూ నైవేద్యంగానూ పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే అంతకుమించిన ఔషధ గుణాలెన్నో అందులో దాగున్నాయి. అందుకే ఈ పూజా ఫలం... అమృత తుల్యం అంటుంటారు. ఈ పండ్లను ఏనుగులు వీటిని ఎంతో ఇష్టంగా తింటాయి. కాబట్టేనేమో ఎలిఫెంట్‌ యాపిల్‌ అనీ కూడా అంటారు. వినాయక చవితి మొదలుకుని వేసవి వరకూ ఇవి వస్తూనే ఉంటాయి. మిగిలిన పండ్ల మాదిరిగా కాకుండా కొబ్బరికాయలా దీన్ని కూడా పగుకొట్టి తినాల్సిందే. 
 
‘నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు’ అనే సామెత కూడా ఉంది. ఎందుకంటే బాగా వగరుగా ఉండే దీని గుజ్జు గొంతు దిగడం చాలా కష్టం. అయినప్పటికీ దీంతో చేసే పెరుగు పచ్చడి, పప్పు కూరని రుచి చూడాల్సిందే. పండిన గుజ్జు అయితే మంచి వాసన వస్తూ తీపీ పులుపూ కలిపిన రుచితో ఉంటుంది. దీన్ని బెల్లం లేదా తేనె అద్దుకుని తింటారు. వేసవిలో నిమ్మకాయ షర్బత్‌లా ఈ జ్యూస్‌ దాహార్తిని తీరుస్తోంది.
 
మిగిలిన పళ్లలో మాదిరిగానే ఇందులోనూ పోషకాలకూ ఏమాత్రం కొదవలేదు. ఇందులో ప్రోటీన్లు, బీటా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లోవిన్‌, నియాసిస్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, ఆక్సాలిక్‌, మాలిక్‌, సిట్రిక్‌ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండే మంచి మందు. 
 
వెలగపండు గుజ్జు జీర్ణశక్తికి ఎంతో మంచిది. రక్తహీనత లేకుండా చేస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడేవాళ్లకి తరుచూ ఈ పండ్లు తినడం వల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. రాళ్లు కూడా తొలగిపోతాయి. బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల కాలేయ సమస్యలనూ నివారిస్తోంది. హృద్రోగులకూ మంచి టానిక్‌లా పనిచేస్తుంది. నేత్రాలకు మంచిది. స్త్రీలు ఈ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి