భారత్తో కుదుర్చుకున్న చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత తగ్గించలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య సహాయకుడు ఒకరు తెలిపారు. భారత్- అమెరికా పౌర అణు ఒప్పందాన్ని తమ దేశ ప్రభుత్వం వెనక్కు నెట్టిందని వస్తున్న వార్తలను తోసిపుచ్చారు.
మాజీ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) అధికారి బ్రూస్ రీడెల్ మాట్లాడుతూ.. బుష్ హయాంలో సంతకం చేసిన ఈ ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడలేదని స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్కు నిరాయుధీకరణ వ్యవహారాలపై ప్రత్యేక సలహాదారుగా రాబర్ట్ ఎన్హోర్న్ నియామకం అణు ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు అడ్డంకిగా తాను భావించడం లేదన్నారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా గత ప్రభుత్వ హయాంలో భారత్- అమెరికా పౌర అణు ఒప్పందానికి మద్దతుగా ఓటు వేశారు. ఈ ఒప్పందం అమల్లోకి రావాలని ఆయన ఆ సందర్భంగా ఆకాంక్షించారని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే రాబర్ట్ ఎన్హోర్న్ ఈ అణు ఒప్పందానికి వ్యతిరేకి అనే వాదనలు ఉన్నాయి. దీనిపై ఆయనకు అభ్యంతరాలు ఉండటంపై రీడెల్ మాట్లాడుతూ.. అమెరికా దౌత్యవేత్తలలో ఎన్హోర్న్ ఎంతో ప్రతిభావంతుడని, అణు అంశాల్లో ఆయన నిపుణుడని చెప్పారు.