పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అంగీకరించారు. సిరాజుద్దీన్ హఖానీ వంటి తీవ్రవాద కమాండర్లతో ఐఎస్ఐకి సంబంధాలు ఉన్నాయని ముషారఫ్ సోమవారం పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో భారత దౌత్యకార్యాలయంపై జరిగిన దాడిలో హఖానీని ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నారు. బైతుల్లా మెహసూద్ నేతృత్వంలోని తెహ్రీక్ ఎ తాలిబాన్ తీవ్రవాద సంస్థ కిడ్నాప్ చేసిన తమ ఆఫ్ఘనిస్థాన్ దౌత్యాధికారిని విడిపించుకునేందుకు ఐఎస్ఐ హఖానీ పరపతిని ఉపయోగించుకుందని ముషారఫ్ వెల్లడించారు.
బైతుల్లా మెహసూద్ వద్ద హఖానీ తన పరిపతిని ఉపయోగించి ఆఫ్ఘనిస్థాన్లో పాక్ దౌత్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని విడిపించాడని తెలిపారు. దక్షిణ వజీరిస్థాన్లో తలదాచుకున్న బైతుల్లా మోహసూద్ను పాక్ ప్రభుత్వం అత్యంత ప్రమాదకర తీవ్రవాదిగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కేసులో మెహసూద్ ప్రధాని నిందితుడు.
తాజాగా జర్మనీకి చెందిన డేర్ స్పేగెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ మాట్లాడుతూ.. ఐఎస్ఐకి తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. కాబూల్లో కిడ్నాప్ అయిన తమ దౌత్యాధికారిని విడిపించుకునేందుకు హఖానీని ఉపయోగించుకున్నాము. దీనర్థం తాము హఖానీకి మద్దతిచ్చినట్లు కాదని ముషారఫ్ తెలిపారు.
పాక్ నిఘా సంస్థ కొంత మంది శత్రువులను ఇతర శత్రువులను అరికట్టేందుకు ఉపయోగించుకుంటుంది. తీవ్రవాదులందరినీ శత్రువులుగా చేసుకునే కంటే, వారిని ఒకరి తరువాత ఒకరిని అరికట్టడం ఉత్తమమని ముషారఫ్ అభిప్రాయపడ్డారు.
ఐఎస్ఐ తాలిబాన్లకు మద్దతు ఇస్తుందని అమెరికా మీడియాలో వస్తున్న కథనాలపై ముషారఫ్ మాట్లాడుతూ.. నిఘా సంస్థలు ఎల్లప్పుడు ఇతర నెట్వర్క్లతో సంబంధాలు కలిగివుంటాయని, అమెరికన్లు కేజీబీ విషయంలో చేసిందే, ఐఎస్ఐ కూడా చేస్తుందని అభిప్రాయపడ్డారు.