పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించే నిమిత్తం ఆదివారం సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళారు. గిలానీ తన రెండు రోజుల పర్యటనలో ప్రత్యేకించి ఆర్ధిక సహకారంపై సౌదీ ఉన్నతస్థాయి నాయకత్వంతో చర్చించనున్నారు.
వాణిజ్య మంత్రి మక్దూమ్ అమిన్ ఫాహిమ్, పరిశ్రమల శాఖ మంత్రి ఛౌదురీ పర్వేజ్ ఎలాహి, విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బాషిర్లతో కూడిన గిలానీ బృందం పర్యటనలో సౌదీ రాజు అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అజీజ్తో భేటీ అవుతుంది. ద్వైపాక్షిక సంబంధాలను పెంచే మార్గాలపై సౌదీ రాజు అబ్దుల్లాహ్తో చర్చిస్తానని గిలానీ పర్యటనకు వెళ్లే ముందు పేర్కొన్నారు.
పాకిస్థాన్కు ఇంధన సరఫరాను పెంచే విషయం కూడా చర్చల కీలక అంశాల్లో ఒకటి. ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు గానూ గత నెలలో పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సౌదీ అరేబియాలో పర్యటించారు.