16కి చేరిన పెషావర్ పేలుడు మృతుల సంఖ్య

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో మంగళవారం రాత్రి సంభవించిన బాంబు పేలుడులో మృతి చెందినవారి సంఖ్య 16కు పెరిగింది. నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్ రాజధాని పెషావర్‌లోని పెరల్ కాంటినెంటల్ హోటల్‌లో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా హోటల్ వెనుకభాగం కుప్పకూలింది.

శిథిలాల నుంచి సహాయక సిబ్బంది బుధవారం మరో ఐదుగురు మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 16కి చేరుకుంది. మృతుల్లో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. వీరిలో ఇద్దరిని ఐక్యరాజ్యసమితి ఉద్యోగులు. ఇదిలా ఉంటే బాంబు పేలుడులో మరో 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలోనూ అనేక మంది విదేశీయులు ఉన్నారు. గాయపడినవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి