పాకిస్థాన్లోని సమస్యాత్మక నార్త్వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్లో శనివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో నిషేధిత తాలిబాన్ అనుబంధ గ్రూపుకు చెందిన ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారు. పాకిస్థాన్ ప్రభుత్వం, తాలిబాన్ తీవ్రవాదుల మధ్య వివాదాస్పద స్వాత్ శాంతి ఒప్పందాన్ని కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన గ్రూపు కూడా ఇదే కావడం గమనార్హం.
నిర్బంధించిన ఉగ్రవాదులను పెషావర్లోని జైలుకు తీసుకెళుతున్న భద్రతా దళాల కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకొని తాలిబాన్లు పంజా విసిరారు. తాలిబాన్ల ఆకస్మిక దాడిలో తెహ్రీక్ ఎ నిఫాజ్ ఎ షరియా మొహమ్మదీ (టీఎన్ఎస్ఎం) డిప్యూటీ చీఫ్ మౌలానా ముహమ్మద్ ఆలం, ఆ గ్రూపు ప్రతినిధి అమీర్ ఇజాత్ ఖాన్, మరో అధికారి మృతి చెందారు. అతివాద మతపెద్ద సుఫీ మొహమ్మద్ ఈ సంస్థకు నేతృత్వం వహిస్తున్నారు.
సమస్యాత్మక మలకాండ్ ప్రాంతంలో శనివారం ఉదయం 5.10 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని మిలటరీ తెలిపింది. దాడిలో ఐదుగురు సైనికులు కూడా గాయపడ్డారు. స్వాత్ లోయలో తాలిబాన్లపై సైనిక చర్యలో అరెస్టు చేసిన అనేక మంది ఖైదీలను పెషావర్కు తరలిస్తుండగా తీవ్రవాదులు ఈ దాడి చేశారని మిలటరీ అధికారులు వెల్లడించారు.