హఫీజ్ సయీద్‌పై పాకిస్థాన్ ప్రభుత్వ నిఘా

లాహోర్ హైకోర్టు ఆదేశాలపై నిషేధిత జామాదుత్ దవా తీవ్రవాద సంస్థ చీఫ్ మొహమ్మద్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేసినప్పటికీ, అతనిపై పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం గట్టినిఘా పెట్టింది. ముంబయి ఉగ్రవాద దాడులకు ప్రధాన కుట్రదారిగా హఫీజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఈ ఉగ్రవాద దాడుల కేసుకు సంబంధించి సయీద్‌‍ను గత ఏడాది డిసెంబరు 11 నుంచి ఈ వారం ప్రారంభం వరకు పాకిస్థాన్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది. మూడు రోజుల క్రితమే లాహుర్ కోర్టు ఆదేశాలపై సయీద్‌కు స్వేచ్ఛ లభించింది. లాహోర్‌ని జోహార్ టౌన్ ప్రాంతంలో ఉన్న సయీద్ నివాసం వద్ద నుంచి జైలు సిబ్బందిని ఉపసంహరించారు.

అనంతరం పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం సయీద్‌కు భద్రత కల్పించేందుకు పోలీసు సిబ్బందిని అతని ఇంటివద్ద ఉంచింది. వాస్తవానికి అతనిపై నిఘా పెట్టేందుకు పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేమని ప్రభుత్వ అధికారి ఒకరు విలేకరులతో చెప్పారు.

వెబ్దునియా పై చదవండి