మహాప్రభో.. తాగుబోతు భార్య నుంచి రక్షణ కల్పించండి... ఓ భర్త వేడుకోలు

సోమవారం, 21 సెప్టెంబరు 2020 (12:50 IST)
ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. మహాప్రభో... తాగుబోతు భార్య నుంచి తనకు, తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలంటూ ప్రాధేయపడ్డాడు. పీకల వరకు మద్యంసేవించి నానా హింసకు గురిచేస్తోందని, పైగా, మహిళా హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి తనపైనే ఫిర్యాదు చేస్తోందంటూ వాపోయాడు. ఈ ఘటన అహ్మదాబాద్ నగరంలోని ముని నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మనినగర్‌కు చెందిన ఓ వ్యక్తికి 2018లో వివాహమైంది. పెళ్లి తర్వాత తన భార్యకు మద్యం అలవాటు ఉందని గ్రహించాడు. దీంతో మద్యం సేవించడం మానుకోవాలంటూ కోరాడు. కానీ, ఆమె ఆ పని చేయకపోగా మరింతగా తాగసాగింది. 
 
ఈ క్రమంలో ఆమె భర్తను, అత్త మామలను కూడా దూషిస్తూ, హింసించ సాగింది. దీంతో అతడు శారీరకంగా, మానసికంగా బాగా కుంగిపోయాడు. దానికితోడు బాగా తాగి అతడు పనిచేసే దగ్గరకు వచ్చి గొడవ కూడా చేసేది. ముసలివారైన అతని తల్లిదండ్రుల్ని వదిలి వేరేగా ఉండటానికి ఒత్తిడి తేవటంతో ఆమె పోరు పడలేక దూరంగా ఉంటున్నాడు.
 
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ముసలి వాళ్లకు కరోనా సోకడంతో అతడు వారి వద్దకు వచ్చేశాడు. ఆ తర్వాత ఆమె కుట్రపూరితంగా భర్త, అతడి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఇంటి మొదటి అంతస్తులో ఉంటున్న ఆమె తాగి వచ్చి అతడ్ని కొట్టేది. 
 
మహిళా హెల్ప్‌లైన్‌ నెంబర్లకు ఫోన్‌ చేసి భర్తపై తప్పుడు ఆరోపణలు చేసేది. దీంతో విసిగిపోయిన అతడు గురువారం పోలీసులను ఆశ్రయించాడు. తాగుబోతు భార్యనుంచి తనను రక్షించాలని, పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఏర్పాటు చేయాలని వారిని కోరాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు