ఏడేళ్ల పాపకు సర్జరీ- వైద్యుడు ఆత్మహత్య.. బాత్ రూమ్ గోడపై ''సారీ'' అని రాసి..?

శనివారం, 3 అక్టోబరు 2020 (17:24 IST)
కేరళలో ఇటీవలే ఒక వైద్యుడు కూడా సామాజిక మాధ్యమాలలో నెటిజన్ల నుంచి వస్తున్న వేధింపులు భరించలేక తనువు చాలించాడు. బాత్ రూం గోడలపై 'సారీ' అని రాసి అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన అనూప్ కృష్ణ (35) అనే యువడాక్టర్ ఆర్థోపెడిక్‌గా పనిచేస్తున్నాడు. అతడికి సొంతంగా క్లినిక్ కూడా ఉంది. గతనెల 23న అతడి దగ్గరికి మోకాలి శస్త్ర చికిత్స నిమిత్తం ఒక ఏడేళ్ల పాపను తీసుకొచ్చారు. అయితే అతడు ఆ పాపకు సర్జరీ చేశాడు. ఆపరేషన్ చేస్తున్న క్రమంలో.. చిన్నారికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను మరో ఆస్పత్రికి తరలించారు. 
 
కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో.. ఆ చిన్నారి మరణించింది. దీంతో ఆ చిన్నారి కుటుంబసభ్యలు పసిపాప మృతికి అనూపే కారణమని ఆందోళనకు దిగారు. ఆయన హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. తమ కూతురు మృతికి అనూప్ దే బాధ్యత అని వాళ్లు ఆరోపిస్తున్నారు. అనూప్‌పై పోలీసు కేసు కూడా నమోదైంది.
 
ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి సోషల్ మీడియాకు ఎక్కింది. ఈ డాక్టర్‌కు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అనూప్‌కు సామాజిక మాధ్యమాలలో వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు పెరగడంతో అనూప్ తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఈనెల 1న తన హాస్పిటల్‌లోని బాత్ రూంలో విగతజీవిగా పడి ఉన్నాడు. బాత్ రూం గోడలపై 'సారీ' అని రాసి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనూప్ సోషల్ మీడియా వేధింపుల వల్లే చనిపోయాడా..? లేక మరేదైనా కారణముందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
 
అనూప్ కు మద్దతిస్తున్న డాక్టర్లు..అనూప్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో.. కేరళ వైద్యులు ఆయన పక్షానే నిలిచారు. నిజానికి ఈ కోవిడ్ కాలంలో ఆ చిన్నారికి వైద్యం చేయడానికి ముందుకొచ్చినందుకు ఆయనను అభినందించాలని అంటున్నారు.
 
చాలామంది ఆమెకు వైద్యం చేయడానికి నిరాకరించినా.. అనూప్ మాత్రం చేశాడని అంటున్నారు. అనుకోని పరిస్థితుల్లో చిన్నారి మరణించిందనీ, దానికి అనూప్‌ను బాధ్యుడిగా చేయడం సరికాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సుల్ఫీ నుహూ అన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు