ధనుర్మాసం.. ఇంటి ముందు ముగ్గులు తప్పనిసరి!

గురువారం, 18 డిశెంబరు 2014 (13:35 IST)
ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గులు తప్పనిసరి అని పండితులు అంటున్నారు. ఏ ఇంటి ముందు ధనుర్మాసంలో కళ్లాపిచల్లి ముగ్గుపెట్టి వుంటుందో ఆ ఇంటికి రావడానికే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఉదయాన్నే వాకిలి శుభ్రంగా ఊడ్చి ఆవుపేడతో కళ్లాపిచల్లి బియ్యపు పిండితో ముగ్గు పెడుతుంటారు.
 
ఇక పండుగ రోజుల్లో ఈ ముగ్గు మరింత అందంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటూ వుంటారు. పూర్వకాలం నుంచి కూడా ఇది మన ఆచారవ్యవహారాల్లో ఒక భాగమైపోయింది. అయితే ఇంట్లో పితృ కార్యాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, ఇంటిముందు వాకిట్లో ముగ్గు పెట్టకూడదని చెబుతోంది.
 
ముగ్గులేని వాకిట్లోకి రాకుండా లక్ష్మీదేవి ఎలా వెనుదిరిగి పోతుందో, ముగ్గువేసిన వాకిట్లోకి రాకుండా పితృదేవతలు కూడా అలానే వెనుదిరిగిపోతారని అంటోంది.పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట. అందువల్లనే పితృకార్యం నిర్వహించాక వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు పెట్టాలని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే వాకిట్లో ముగ్గులేని ఇళ్లలోకి ప్రవేశించడానికి దుష్టశక్తులు సిద్ధంగా ఉంటాయని అంటారు. 
 
అందువలన పితృకార్యం నిర్వహణ పూర్తి అయిన తరువాత, వెంటనే వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గుపెట్టాలని చెబుతుంటారు. దీనిని బట్టి ముగ్గు అనేది ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాదు, ఇంటికి రక్షణని కూడా ఇస్తుందని గ్రహించాలి. ఇంకా ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గే ఆ గృహానికి రక్షణ అని పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి