125 సంవత్సరాల 7 మాసాలు జీవించిన శ్రీకృష్ణుడు: ఆ రోజే కలియుగం ప్రారంభం

గురువారం, 25 జూన్ 2015 (17:11 IST)
కురుక్షేత్ర మహాసంగ్రామంలో శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతిగా నిలుస్తారు. విజయునికి గీతను బోధించి యుద్ధానికి సంసిద్ధం చేస్తాడు. వారికి విజయం చేకూరుస్తారు. తన వద్దకు అర్థియై వచ్చిన కుచేలుని అనుగ్రహిస్తాడు. 
 
ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడిని చూసేందుకు బ్రహ్మాది దేవతలు వస్తారు. ఓ దేవదేవా మీరు భూలోకంలోకి వచ్చి 125 సంవత్సరాలు అయ్యింది. ఈ అవతారం చాలించి, ద్వాపర యుగాంతంలో వైకుంఠానికి విచ్చేయాల్సిందిగా కోరుతారు. హరి సరేనని వారిని సాగనంపుతారు.

ఆపైన కాలం సమీపించిందని గ్రహించిన శ్రీకృష్ణుడు యాదవులను ద్వారక నుంచి ప్రభాస తీర్థానికి పంపుతాడు. సరిగ్గా ఏడవ రోజున సముద్రుడు ద్వారకను ముంచివేస్తాడు. యదుక్షయం జరుగుతుంది. కలియుగం ఆరంభం అవుతుంది. అని శ్రీకృష్ణుడు ఉద్దవునితో అంటాడు. ఈ క్రమంలో యాదవులు మదిరాపాన మత్తులై ఒకరినొకరు సముద్రపు ఒడ్డున పెరిగి ఉన్న తుంగలో కొట్టుకుని మరణిస్తారు. అటు పిమ్మట బలరామకృష్ణులు వేర్వేరు తోవలలో మహాప్రస్థానాన్ని ప్రారంభిస్తారు. 
 
శ్రీకృష్ణుడు కొంత దూరం వెళ్లి ఒక నికుంజ పొద చాటున విశ్రమిస్తాడు. ఒక వేటగాడు పొదచాటున ఉన్న ఆ దేవదేవుని చరణ కమలాలను లేడి చెవులుగా భ్రమించి బాణం వేస్తాడు. ఆపైన తను చేసిన తప్పు తెలుసుకుని బోయవాడు నిలువెల్లా వణికిపోతూ శ్రీకృష్ణుని వద్దకు వస్తాడు. అయితే శ్రీకృష్ణుడు అతడిని సముదాయించి, ప్రాణములు వదిలి వైకుంఠ పద ప్రాప్తుడయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మ 125 సంవత్సరాల 7 మాసాలు జీవించాడు. క్రీస్తు పూర్వము 3102 నిర్యాణ సంవత్సరము కాగా ఆ రోజే కలియుగము ప్రారంభం కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి